
Hyderabad, May 22: తెలంగాణ రాష్ట్రంలో రోజూవారీ కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రెండు వారాల కిందట 4 వేలకు పైబడి నమోదయ్యే కేసులు, ఇప్పుడు 3 వేలల్లోనే నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మే 30వ తేదీ వరకు 20 గంటల లాక్డౌన్ అమలులో ఉండనుంది. ఈ లాక్డౌన్ కాలంలో కేసులు ఇంకా ఎంతవరకు తగ్గనున్నాయో చూడాలి. మరోవైపు పాజిటివ్ కేసుల కంటే, రికవరీలు పెరుగుతుండటం విశేషం. దీంతో రాష్ట్రంలో క్రమంగా ఆక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి.
రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 63,120 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 3,308 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1,765 మంది శాంపుల్స్కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,51,035కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 513 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 203 కేసులు, రంగారెడ్డి నుంచి 226, ఖమ్మం నుంచి 228 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 21 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,106కు పెరిగింది.
అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 4,723 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,04,970 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42,959 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.