Hyderabad, Sep 12: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2278 పాజిటివ్ కేసులు (Telangana Coronavrius Cases) నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,54,880 కి చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 950 కి (Coronavirus Deaths) చేరింది. శుక్రవారం ఒక్కరోజే 2458 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,21,925. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,005. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.75 శాతం ఉండగా.. తెలంగాణలో 78.7 శాతంగా ఉందని తెలిపింది. మరణాల రేటు భారత్లో 1.66 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 0.61 శాతంగా ఉందని వెల్లడించింది. గత 24 గంటల్లో 62,234 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇప్పటివరకు మొత్తం 20,78,695 పరీక్షలు చేశామని తెలిపింది.
ఇప్పటివరకు రాష్ట్రంలో 20,16,461 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం బులెటిన్లో వెల్లడించారు. గత నెల 10 నాటికి 6,42,875 టెస్టులు జరిగాయి. అలాగే ప్రతీ పది లక్షల మందిలో 17,315 మందికి పరీక్షలు నిర్వహించారు. అప్పట్నుంచి ఈ నెల రోజుల వ్యవధిలో అదనంగా 13,73,586 కరోనా టెస్టులు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు.
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద ప్రజలు చికిత్స చేయించుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద డబ్బులు రీయింబర్స్ చేస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు లేని పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని, ప్రజల ఆరోగ్యానికి మించి ఇంకేదీ తమకు ప్రాధాన్యంకాదని, ఎంత డబ్బయినా ఖర్చు పెడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అహోరాత్రాలు కష్టపడుతున్నామని, వైద్యసేవలు, సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.