
Hyderabad, June 1: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి తగ్గుతున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం ఇటీవల కాలంగా వందకు పైగానే కేసులు నమోదవుతుండటం గమనార్హం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ అర్బన్, కరీంనగర్ తదితర సుమారు పది జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా కొనసాగుతోంది. ఈ జిల్లాల్లో వైరస్ కట్టడి కోసం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నుండి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే, ప్రజలతో ఎప్పుడూ మమేకమై ఉంటూ కరోనా ముప్పు అధికంగా పొంచి ఉండే హైరిస్క్ గ్రూప్ వారిని గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లను ప్రభుత్వం చేపడుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎలాగూ లాక్డౌన్ కొనసాగుతోంది, ఈ క్రమంలో జూన్ చివరి నాటికి రాష్ట్రంలో సెకండ్ వేవ్ దాదాపు నియంత్రణలోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేసుకుంటున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో గల కోవిడ్ కేసులను పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 94,189 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,493 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 1462 మంది శాంపుల్స్కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,80,844కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 318 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 137 కేసులు, రంగారెడ్డి నుంచి 152 మరియు నల్గొండ నుంచి 165 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 15 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,296కు పెరిగింది.
అలాగే సాయంత్రం వరకు మరో 3,308 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 5,44,294 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33,254 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.