
Hyderabad, May 10: చుట్టూ ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కోవిడ్ పరిస్థితులు మితంగానే ఉన్నట్లు ఆరోగ్య శాఖ నివేదికల ద్వారా తెలుస్తుంది. గడిచిన ఒక్కరోజులో తెలంగాణ పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో 22,164 కేసులు, కర్ణాటకలో 47,930, మహారాష్ట్రలో 48,401, అటు తమిళనాడులో 28,897, కేరళలో 35,801 కేసుల చొప్పున నమోదయ్యాయి, ఆయా రాష్ట్రాల్లో కఠిన లాక్డౌన్ ఆంక్షలు అమలు అవుతున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం అటు-ఇటుగా సుమారు 5 వేల కోవిడ్ కేసులు నమోదవుతుండటం గమనార్హం.
రాష్ట్రంలో కేసులను పరిశీలిస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 62,923 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 4,826 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 2,345 మంది శాంపుల్స్కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,02,187కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 723 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 324 కేసులు, రంగారెడ్డి నుంచి 302, నల్గొండ నుంచి 295 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 32 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,771కు పెరిగింది.
అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 7754 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,36,619 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62,797 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.