COVID19 in TS: తెలంగాణలో వెయ్యి మార్కును దాటిన రోజూవారీ కోవిడ్ కేసులు, రాష్ట్రంలో 7 వేలకు చేరువైన ఆక్టివ్ కేసుల సంఖ్య, సెకండ్ వేవ్ కట్టడి కోసం ప్రజలు సహకరించాలని కోరిన ఆరోగ్యశాఖ
Image of Gandhi Hospital, COVID19 Outbreak in Telangana. | Photo: Twitter

Hyderabad, April 3: తెలంగాణలో కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం నాటికి రోజూవారి కోవిడ్ కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటేసింది. 2021లో ఇదే అత్యధికం. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వ యంత్రాంగం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం కోవిడ్ నివారణకు ఏకైక మార్గమైన టీకాల పంపిణీ వేగవంతం చేయడంతో పాటు, కరోనా సోకిన వారికి చికిత్స మరియు వారి నుంచి మరొకరికి సోకకుండా  తప్పనిసరి చర్యలు తీసుకోవడం, టెస్టుల సామర్థ్యం పెంచడం తదితర కార్యక్రమాలను చేపట్టింది. ఈ ప్రయత్నాల్లో భాగంగా, ప్రజలు కోవిడ్ నివారణకు సహకరించాలని ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. ప్రజలను కోరారు. ప్రయాణాలు తగ్గించుకోవడం, బయటకు వెళ్తే మాస్కులు ధరించడం తదితర కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని వారు సూచిస్తునారు.

ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 59,705 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1078 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 2129 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,10,819కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 283 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 113 కేసులు, రంగారెడ్డి నుంచి 104, నిజామాబాద్ నుంచి 65 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 6 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,712కు పెరిగింది.

అలాగే శుక్రవారం సాయంత్రం వరకు మరో 331 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,02,207 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,900 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 45 ఏళ్లు పైబడిన పౌరులకు టీకాల పంపిణీ జరుగుతోంది.