Hyderabad, January 18: తెలంగాణలో కరోనా నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. శనివారం తొలిరోజున 140 కేంద్రాల్లో టీకా పంపిణీ చేయగా ఈరోజు నుంచి అదనంగా మరో 184 కేంద్రాలలో టీకా పంపిణీ చేయనున్నారు. తొలి రోజున కోవిషీల్డ్ టీకా అందుకున్న సుమారు 4 వేల లబ్దిదారులు ఆరోగ్యంగా ఉన్నారు, ఎవరిలోనూ ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించడం లేదని అధికారులు వెల్లడించారు. మొదటి రోజున పుణెకు చెందిన సీరం సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ టీకాను మాత్రమే రాష్ట్రంలో వినియోగించారు. ఈరోజు తెలంగాణకే చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను వినియోగించనున్నారు.
ఇక రాష్ట్రంలోని కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 21,893 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 206 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 350 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 74,83,580 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 291,872కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 45 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 16, మేడ్చల్ నుంచి 11, కరీంనగర్ నుంచి 17 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
మరోవైపు గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి.దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,579కు పెరిగింది. అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 346 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 286,244 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,049 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.