Telangana Corona Report: తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు, కొత్తగా మరో 51 కేసులు నమోదు, రాష్ట్రంలో 1326కు చేరిన మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య
Coronavirus in India | (Photo Credits: PTI)

Hyderabad, May 13: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1326కు చేరింది. గత 24 గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో 37 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 14 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిన్న మరో రెండు కరోనా మరణాలు నమోదయ్యాయి. మృతులు ఇద్దరూ కూడా హైదరాబాద్- పాతబస్తీకి చెందిన వారే. వీరిద్దరి వయసు 60 ఏళ్ల పైబడి ఉండటంతో పాటు హైపర్ టెన్షన్, డయాబెటీస్ లాంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 32కు పెరిగింది.

ఇక, నిన్న మరో 21 కోవిడ్-19 బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 822 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 472 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ద్వారా తెలుస్తోంది.

Telangana's #COVID19  Report:

Status of positive cases of #COVID19 in Telangana

రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్-19 బాధితులను పరిశీలిస్తే, గత రెండు వారాలుగా దాదాపుగా కేసులన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. జిల్లాల నుంచి కేసులు రావడం పూర్తిగా ముగిసిపోయిందనుకున్న తరుణంలో ఇతర దేశాలు మరియు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో వారిలో కొందరికి పాజిటివ్ గా నిర్ధారణ అవుతున్నాయి. ఇలా ఇప్పటివరకు 25 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాని యాదాద్రి జిల్లాల్లో ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన వారిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మొన్న ఆదివారం రోజు నలుగురికి కరోనా సోకినట్లు తేలగా, మంగళవారం 14 మందికి పాజిటివ్ గా నిర్ధారింపబడింది. జగిత్యాలలో మరో ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 25 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.