
Hyderabad, April 14: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అకస్మాత్తుగా రోజురోజుకి పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండటం, రికవరీలు తగ్గుతుండటం మూలానా రాష్ట్రంలో కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గత నెల మార్చి 1న తెలంగాణలో 1,907గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే 25 వేలకు చేరుకుంది. అంటే కేవలం నెలన్నరలోనే తెలంగాణలో ఆక్టివ్ కేసుల సంఖ్య ఏకంగా 12 రేట్లు పెరిగింది.
అలాగే కోవిడ్ ఇన్ఫెక్షన్ల పెరుగుదల కారణంగా, తెలంగాణలో ప్రస్తుతం ప్రభావవంతమైన పునరుత్పత్తి సంఖ్య (Rt) 1.65గా ఉంది. ఇది జాతీయ సగటు 1.33 కంటే ఎక్కువ. ఈ కారణంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే .. నిన్న రాత్రి 8 గంటల వరకు 72,364 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 2,157 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 4,959 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,34,738కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 361 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 245 కేసులు, రంగారెడ్డి నుంచి 206, నిజామాబాద్ నుంచి 187, సంగారెడ్డి నుంచి 135, మరియు జగిత్యాల నుంచి 107 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 8 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,780కు పెరిగింది.
అలాగే మంగళవారం సాయంత్రం వరకు మరో 821మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3,07,499మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,459 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. హెల్త్ కేర్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 45 ఏళ్లు పైబడిన పౌరులకు టీకాల పంపిణీ జరుగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో సుమారు 31.23 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తన నివేదికలో పేర్కొంది.