CRPF (photo-PTI)

CRPF: దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ బలగమైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో జవాన్ల ఆత్మహత్యలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. 2021 నుంచి 2025 వరకు సేకరించిన ఐదేళ్ల గణాంకాల విశ్లేషణ ప్రకారం.. గడిచిన ఏడాది 2025లో అత్యధికంగా 59 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఐదేళ్ల కాలంలో ఒకే ఏడాది ఇన్ని ఆత్మహత్యలు నమోదు కావడం ఇదే గరిష్ఠం కావడం గమనార్హం. గత ఐదేళ్లలో మొత్తం 281 మంది బలవన్మరణానికి గురవగా.. అందులో ఏకంగా 237 మంది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కేడర్లకు చెందిన నాన్-గెజిటెడ్ ర్యాంక్ సిబ్బందే కావడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.

ఇటీవల వెలుగులోకి వచ్చిన గణాంకాల ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వారిలో అత్యధిక శాతం జవాన్లు విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల వ్యవధిలో నమోదైన మొత్తం 262 కేసుల్లో దాదాపు 77 శాతానికి పైగా.. అంటే 202 మంది సిబ్బంది విధి నిర్వహణలో ఉన్నప్పుడే బలవన్మరణానికి గురయ్యారు.

మిగిలిన వారు సెలవుపై ఇళ్లకు వెళ్లిన సమయంలో ఈ దురదృష్టకర సంఘటనలు జరిగాయి. సంవత్సరాల వారీగా పరిశీలిస్తే 2021లో 57 మంది, 2022లో 43 మంది, 2023లో 57 మంది, 2024లో 46 మంది, అలాగే 2025లో 59 మంది జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు.

CRPF Records Highest Suicides in Five Years in 2025

సుమారు 3.25 లక్షల మంది సిబ్బంది కలిగిన సీఆర్పీఎఫ్‌లో ఏ క్షణంలోనైనా 95 నుండి 97 శాతం మంది నిరంతరం తీవ్రవాదుల ఏరివేత, చొరబాట్ల నిరోధం, ఎడతెగని శాంతిభద్రతల పరిరక్షణ వంటి సవాలుతో కూడిన విధుల్లో నిమగ్నమవుతుంటారు. విశ్లేషణ ప్రకారం అత్యధిక శాతం కేసుల్లో కుటుంబ సమస్యలు, భూతగాదాలు, సుదీర్ఘకాలం కుటుంబానికి దూరంగా ఉండటం ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

వీటితో పాటు తీవ్ర మానసిక ఒత్తిడి, విశ్రాంతి లేని కఠినమైన డ్యూటీలు కూడా ఇందుకు దారితీస్తున్నాయి. ఈ పరిణామాలపై సీఆర్పీఎఫ్ అధికారిక ప్రకటన ఏదీ విడుదల చేయనప్పటికీ, జవాన్ల శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచేందుకు, ఒత్తిడి తగ్గించేందుకు నిరంతరం ప్రత్యేక కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నట్లు దళ అధికారులు తెలిపారు.