SC on Air Force Resignations: భారత వైమానిక దళం (IAF)లో పనిచేస్తున్న సభ్యులకు తమ ఇష్టానుసారం పౌర (సివిల్) ఉద్యోగాలలో చేరడానికి సేవ నుండి వైదొలగే 'నిరపేక్ష హక్కు' (Absolute right) లేదని సుప్రీంకోర్టు బుధవారం తీర్పులో స్పష్టం చేసింది. సివిల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ముందు పై అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం అనేది మినహాయించదగిన సాధారణ నియమం కాదని.. వైమానిక దళ కార్యాచరణ సంసిద్ధత, దళ క్రమశిక్షణ దృష్ట్యా అది ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత అని తేల్చిచెప్పింది.
జస్టిస్లు ఉజ్జల్ భూయాన్, అతుల్ ఎస్ చందుర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ధర్మాసనం తరఫున తీర్పును రాసిన జస్టిస్ చందుర్కర్ పేర్కొంటూ.. వాయుసేన సిబ్బంది అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యవస్థలో భాగం. ఐఏఎఫ్ నుండి వాయు యోధులు అకాలంగా తప్పుకోవడాన్ని నియంత్రించడానికే ఈ నిబంధనలు తెచ్చారు. సివిల్ పోస్టుకు దరఖాస్తు చేసే ముందు ముందస్తు అనుమతి తీసుకోవడం.. ఆ తర్వాత ఎన్ఓసి (NOC) పొందడం అనేది ఎయిర్మన్ తన ఇష్టానుసారం వదిలేయగల సాధారణ విషయం కాదని వ్యాఖ్యానించారు.
వందేమాతరం బిల్లుకు ఉభయసభలు ఆమోదం.. ఇకపై ఎవరైనా గీతాన్ని అవమానిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు..
రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (RPSC) ద్వారా 'అసిస్టెంట్ ప్రొఫెసర్ (హిందీ)'గా ఎంపికైన ఐఏఎఫ్ కార్పోరల్ నఖత్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తూ ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఏడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సింగ్.. నవంబర్ 2020లో వచ్చిన రిక్రూట్మెంట్ ప్రకటన ఆధారంగా సివిల్ పోస్టుకు దరఖాస్తు చేసి, పరీక్షలు, ఇంటర్వ్యూలో విజయం సాధించారు. ఎంపికైన తర్వాత అక్టోబర్ 2022లో ఆయన ఎన్ఓసి, డిశ్చార్జ్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ దానిని తిరస్కరించారు. 2017 నాటి ఎయిర్ ఫోర్స్ ఆర్డర్ ప్రకారం సివిల్ పోస్టుకు దరఖాస్తు చేయడానికి ముందే అనుమతి పొందాల్సి ఉండగా.. ఆయన అలా చేయలేదని వైమానిక దళం పేర్కొంది. ఇప్పటికే ఈ తిరస్కరణను సాయుధ దళాల ట్రిబ్యునల్ (AFT), ఢిల్లీ హైకోర్టు సమర్థించగా.. తాజాగా సుప్రీంకోర్టు కూడా వారి అప్పీల్ను కొట్టివేస్తూ వైమానిక దళ నిబంధనలకే మొగ్గు చూపింది.