CJI on CAA: దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది! పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీం చీఫ్ జస్టిస్ బోబ్డే వ్యాఖ్యలు, ఆందోళనలు తగ్గినపుడే ఆ పిటిషన్లపై విచారిస్తామని స్పష్టంచేసిన సుప్రీంకోర్ట్

పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లు చట్టబద్దమైనదా.. కాదా? అనేది మేమేల నిర్ణయించగలం? ఒక న్యాయవాదిగా మీకు ఈ విషయం తెలిసి ఉండాలి. ఒక చట్టం యొక్క ప్రామాణికత ఏంటి, అది అమలయ్యే విధానం కోర్ట్ ప్రశ్నిస్తుంది గానీ, చట్టాన్ని రాజ్యాంగ బద్ధమైనదిగా ప్రకటించడం కోర్ట్ పని కాదు....

CJI on CAA: దేశం చాలా క్లిష్ఠ పరిస్థితుల్లో ఉంది!  పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీం చీఫ్ జస్టిస్ బోబ్డే వ్యాఖ్యలు, ఆందోళనలు తగ్గినపుడే ఆ పిటిషన్లపై విచారిస్తామని స్పష్టంచేసిన సుప్రీంకోర్ట్
Chief Justice of India Sharad Arvind Bobde (Photo Credits: IANS)

New Delhi, January 9:   దేశంలో పరిస్థితులు చాలా సంక్షిష్ఠంగా ఉన్నాయని సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బొబ్డే (SA Bode) గురువారం అభిప్రాయపడ్డారు. సిఎఎపై దాఖలైన పిటిషన్ పై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ చట్టాన్ని (Citizenship Amendment Act)  "రాజ్యాంగబద్ధమైనది" గా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టంపై దుష్ప్రచారం, పుకార్లు వ్యాప్తిచేస్తున్న పలు యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులు, పార్టీల కార్యకర్తలు మరియు మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది వినీత్ ధండా సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ పట్ల జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మొదటిసారిగా పౌరసత్వం చట్టం 'రాజ్యాంగ బద్ధం' (Constitutional Act) అంటూ ఒకరు పిటిషన్ వేయడం చూస్తున్నాం అని న్యాయమూర్తులు తెలిపారు. అయితే దీనిపై అత్యవసర విచారణ చేపట్టడానికి తిరస్కరించిన సుప్రీంకోర్ట్, దేశంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న వేళ ఇలాంటి పిటిషన్లు సహాయం చేయలేవని పేర్కొంది. "దేశంలో పరిస్థితులు సంక్లిష్ఠంగా ఉన్నాయి. తీవ్రమైన హింస జరుగుతుంది. శాంతి కోసం ప్రయత్నాలు జరగాలి" అని జస్టిస్ బోబ్డే అన్నారు.

"పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లు చట్టబద్దమైనదా.. కాదా? అనేది మేమేల నిర్ణయించగలం? ఒక న్యాయవాదిగా మీకు ఈ విషయం తెలిసి ఉండాలి. ఒక చట్టం యొక్క ప్రామాణికత ఏంటి, అది అమలయ్యే విధానం కోర్ట్ ప్రశ్నిస్తుంది గానీ, చట్టాన్ని రాజ్యాంగ బద్ధమైనదిగా ప్రకటించడం కోర్ట్ పని కాదు" అని ధర్మాసనం అభిప్రాయ పడింది.

అయితే, దేశంలో ఆందోళనలు తగ్గి, ప్రశాంత వాతావరణం ఏర్పడినపుడు CAA పై దాఖలైన పిటిషన్లపై విచారణలు చేపడతామని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో CAAపై సుమారు 60 పిటిషన్లు దాఖలైనట్లు సమాచారం.

(The above story first appeared on LatestLY on Jan 09, 2020 05:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).