Sedition Case: సిఎఎ వ్యతిరేక సభలో యువతి 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలపై, దేశద్రోహం కేసు నమోదు, 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించిన కోర్ట్, బీజేపీ కుట్రగా అభివర్ణించిన ఓవైసీ

ఇదిలా ఉండగా అమూల్య వెనుక బీజేపి హస్తం ఉందని ఓవైసీ ఆరోపించారు. ఆ యువతికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. తాము భారతీయులం అని, భారతీయులుగా గర్విస్తున్నామని అసదుద్దీన్ స్పష్టం చేశారు....

Sedition Case: సిఎఎ వ్యతిరేక సభలో యువతి 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలపై, దేశద్రోహం కేసు నమోదు, 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించిన కోర్ట్, బీజేపీ కుట్రగా అభివర్ణించిన ఓవైసీ
Woman created ruckus during AIMIM chief Asaduddin Owaisi's rally in Bengaluru (Photo Credits:ANI)

Bengaluru, February 21: బెంగళూరులో జరిగిన సిఎఎ వ్యతిరేక ర్యాలీలో 'పాకిస్తాన్ జిందాబాద్' అని వివాదాస్పద నినాదాలు చేసిన అమూల్య లియోనా (Amulya Leona) అనే యువతిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆమెకు బెయిల్ ను కూడా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ తిరస్కరించారు.

హిందూ ముస్లిం సిక్కు ఇసాయ్ సమాఖ్య  (Hindu Muslim Sikh Isaai Federation) అధ్వర్యంలో గురువారం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగళూరులో ర్యాలీ (Ant- CAA Rally)  జరిగింది. ఈ ర్యాలీలో AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అమూల్య లియోనా అనే విద్యార్థి నేత వేదిక పైనుంచే "పాకిస్థాన్ జిందాబాద్" అంటూ చేసింది. వేదికపైనే ఉన్న అసదుద్దీన్ ఒవైసీ, తదితరులు వెంటనే అప్రమత్తమై, ఆమెను వారించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటన సభలో గందరగోళం సృష్టించింది. దీనిని సుమోటోగా స్వీకరించిన బెంగళూరు నగర పోలీసులు ఆ యువతిపై సెక్షన్ 124 ఎ (దేశద్రోహం), 153 ఎ మరియు బి (ఇరు వర్గాల మధ్య శత్రుత్వం ప్రోత్సహించడం, జాతీయ సమైక్యతకు భంగం కలిగించడం) కింద కేసులు నమోదు చేశారు.

Video of the Incident:

శుక్రవారం పోలీసులు అమూల్యను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆమెను జ్యుడీషియల్ కస్టడీకీ అప్పజెప్తూ ఉత్తర్వులు వెలువరించారు. మరోవైపు అమూల్య చేసిన దేశవ్యతిరేక వ్యాఖ్యల పట్ల కొంతమంది చిక్క మంగళూరులోని ఆమె ఇంటిపై దాడి చేశారు. దీంతో పోలీసులు వారిపై కూడా కేసులు నమోదు చేశారు.

కాగా, జరిగిన ఘటనపై అమూల్య తండ్రి స్పందిచారు. తమ కుమార్తె వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఇంట్లో వారి మాట వినకుండా తమ కుమార్తె ముస్లిం సంఘాల సభ్యులతో చేతులు కలిపి వారి రాజకీయాల్లో బలవుతుందని చెప్పారు. అయితే తమ కుమార్తెను విడిపించడానికి తాము ఎలాంటి బెయిల్ ఇప్పించే ప్రయత్నం చేయమని వారు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా అమూల్య వెనుక బీజేపి హస్తం ఉందని ఓవైసీ ఆరోపించారు. ఆ యువతికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. తాము భారతీయులం అని, భారతీయులుగా గర్విస్తున్నామని అసదుద్దీన్ స్పష్టం చేశారు.

(The above story first appeared on LatestLY on Feb 21, 2020 12:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).