AP Parishad Elections: ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సంచలన తీర్పు, రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఉత్తర్వులు, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల కమీషన్‌కు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలను రాష్ట్ర హైకోర్ట్ రద్దు చేసింది. సుప్రీంకోర్ట్ సూచించిన నిబంధనల మేరకు ఎన్నికలు జరగలేదని హైకోర్ట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపిలో జరిగిన ఎన్నికలను రద్దు చేస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసి....

AP Parishad Elections: ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సంచలన తీర్పు, రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఉత్తర్వులు, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల కమీషన్‌కు ఆదేశం
High Court of Andhra Pradesh | File Photo

Amaravathi, May 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికలను రాష్ట్ర హైకోర్ట్ రద్దు చేసింది. సుప్రీంకోర్ట్ సూచించిన నిబంధనల మేరకు ఎన్నికలు జరగలేదని హైకోర్ట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపిలో జరిగిన ఎన్నికలను రద్దు చేస్తూ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసి, మరోసారి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్ట్ ఎన్నికల కమీషన్ ను ఆదేశించింది.

గత నెల ఏప్రిల్ 8న ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న 7,220 ఎంపిటిసిలు, 515 జెడ్‌పిటిసి స్థానాలకు జరిగిన ఆ ఎన్నికల్లో సుమారు 61 శాతం పోలింగ్ నమోదైంది.

ఏప్రిల్ 1వ తేదీన ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం అదే నెల 8వ తేదీన ఎన్నికలు నిర్వహించింది. అయితే ఎన్నికలకు సిద్ధం అవడానికి కనీసం 4 వారాల గడువు ఇవ్వలేదని రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ ఏపి ప్రతిపక్ష పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. అయినప్పటికీ ఎన్నికల నిర్వహణకు హైకోర్ట్ డివిజన్ బెంచ్ అనుమతిని ఇచ్చింది.  తాము చెప్పేంత వరకు ఓట్ల లెక్కింపు మాత్రం చేపట్టవద్దని ఆదేశించింది.

కాగా, ఈ ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది.  అప్పట్నించీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు పలుమార్లు కొనసాగాయి. తాజాగా, ఏపి పరిషత్ ఎన్నికలకు సంబంధించి విచారణ పూర్తి చేసిన హైకోర్ట్  సింగిల్ బెంచ్, ఆ ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. హైకోర్ట్ తీర్పుపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే వైసీపీ మాత్రం  హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసే వీలుంది. అవసరమైతే ఈ విషయంలో సుప్రీంకోర్టుకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

(The above story first appeared on LatestLY on May 21, 2021 11:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).