Devshayani Ekadashi 2026: దేవశయని ఏకాదశి సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషనాగుపై యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని.. దీనితోనే నాలుగు నెలల పాటు సాగే పవిత్రమైన చాతుర్మాసం ప్రారంభమవుతుందని నమ్ముతారు. 2026వ సంవత్సరంలో జూలై 25, శనివారం నాడు ఈ పండుగను జరుపుకుంటున్నారు. జూలై 24 ఉదయం 9:12 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై జూలై 25 ఉదయం 11:34 గంటలకు ముగుస్తుంది. అనంతరం జూలై 26 ఆదివారం ఉదయం సూర్యోదయం తర్వాత పారణ నిర్వహించి ఉపవాసాన్ని విరమిస్తారు.
ప్రదేశాన్ని బట్టి ఈ రోజును ఆషాఢీ ఏకాదశి, హరి శయనీ ఏకాదశి, పద్మ ఏకాదశి, తోలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను నిర్వహించరు. మహారాష్ట్రలో దీనిని ఆషాఢీ ఏకాదశిగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సంత్ తుకారాం, సంత్ జ్ఞానేశ్వర్ పల్లకీల ఊరేగింపులతో ప్రారంభమయ్యే పండర్పూర్ వారి యాత్ర గత 700 ఏళ్లకు పైగా నిరంతరాయంగా సాగుతోంది. లక్షలాది మంది వార్కరీలు వందల కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ.. అభంగాలు పాడుతూ ఏకాదశి ముందు రోజు పండర్పూర్ చేరుకుని విఠల్ స్వామిని దర్శించుకుంటారు.
ఈ పవిత్ర దినం వెనుక అనేక పురాణ గాథలు ఉన్నాయి. మంధాత మహారాజు కరువుతో అల్లాడుతున్న తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి వర్షాలు కురిపించాడని చెబుతారు. అలాగే వేదాలను దొంగిలించిన శంఖాసురుడిని సంహరించి వేదాలను రక్షించిన అనంతరం విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకున్న రోజు కూడా ఇదేనని నమ్ముతారు. అంతేకాక బలి చక్రవర్తి భక్తికి మెచ్చిన విష్ణువు ప్రతి సంవత్సరం నాలుగు నెలల పాటు పాతాళంలో అతనితో గడుపుతాడని.. ఆ సమయమే ఈ చాతుర్మాసమని పురాణాలు చెబుతున్నాయి.
ఈ రోజున భక్తులు ఉదయాన్నే నిద్రలేచి విష్ణుమూర్తికి పంచామృతంతో అభిషేకం చేసి.. తులసి దళాలతో పూజిస్తారు. అనంతరం స్వామివారిని చిన్న పడకపై పడుకోబెట్టడం లేదా తెల్లటి వస్త్రంతో కప్పడం ద్వారా శయన ఆచారాన్ని నిర్వహిస్తారు. పూరీ జగన్నాథ ఆలయం, కేరళలోని పద్మనాభస్వామి, శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాల్లో ఈ శయన రూపానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఆరోగ్యాన్ని బట్టి పూర్తి ఉపవాసం లేదా పండ్లు, పాలతో కూడిన సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండటం వల్ల అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.