Kanuma Festival 2022: కనుమరోజు మేకకాళ్ల పులుసు తింటే ఆ కిక్కే వేరప్పా, అయితే ఎలా తయారు చేయాలో చకచకా తెలుసుకుందాం..
కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీ. మాంసాహారులు కానివారు మినుప గారెలు తింటారు. కనుమను ‘ముక్కల పండుగ’ అని అంటారు. సంక్రాంతిపండుగలో మూడవరోజు కనుమ నాడు మాంసాహారం ముందువరుసలో ఉంటుంది. అయితే కనుమ పండుగ రోజు స్పెషల్ మేకకాళ్ల పులుసు, చిల్లిగారెలు చాలా ఇష్టంగా తింటారు.
కావలసినవి: మేక కాళ్లు - ఐదు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర తరుగు - పావు కప్పు, పుదీనా తరుగు - పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్, పసుపు - పావు టీస్పూన్, కారం - రెండు టీస్పూన్లు, ధనియాల పొడి - రెండు టేబుల్స్పూన్లు, గరంమసాలా - అర టీస్పూన్, చింతపండు పులుసు - అరకప్పు, నూనె - మూడు టేబుల్స్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారీ: మేక కాళ్లు కాల్చి పసుపు రాసి, నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత మూడు అంగుళాల సైజులో ముక్కలుగా కట్ చేయాలి. కుక్కర్లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి వేగించాలి. తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత కాళ్లు, గరంమసాలా వేసి కలపాలి. ఇప్పుడు ఐదు గ్లాసుల నీళ్లు, చింతపండు పులుసు పోసి, తగినంత ఉప్పు వేసి మూత పెట్టి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పాయ కోసం పోట్లీ మసాలా అని దొరుకుతుంది. ఆ పొడి ఒక స్పూన్, కొన్ని మసాల దినుసులు ఒకచిన్న వస్త్రంలో వేసి కట్టాలి. దీన్ని కాళ్లతోపాటు ఉడికిస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. పాయలోకి గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు, నాన్ రుచిగా ఉంటాయి.
(The above story first appeared on LatestLY on Jan 16, 2022 12:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

