IND vs WI 2nd T20I: క్యాచ్‌లు వదిలేశారు, మ్యాచ్‌నూ వదిలేశారు. రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు, సిరీస్ సమం, నిర్ణయాత్మక మూడో టీ20 డిసెంబర్ 11న

దుబే ఈ మ్యాచ్ లో ఎన్నో చూడ చక్కని షాట్లు ఆడుతూ ఒకప్పటి యువరాజ్ సింగ్ ను తలపించాడు. రిషబ్ పంత్ 33 * రెండో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా భారత బ్యాట్స్ మెన్ అందరూ 20 పరుగుల లోపే స్కోర్ చేశారు...

IND vs WI 2nd T20I: క్యాచ్‌లు వదిలేశారు, మ్యాచ్‌నూ వదిలేశారు. రెండో టీ20లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు, సిరీస్ సమం, నిర్ణయాత్మక మూడో టీ20 డిసెంబర్ 11న
India vs West Indies T20I 2019. (Photo Credits: IANS)

Thiruvananthapuram:  తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 (Ind vs WI 2nd T20i) లో భారత్‌పై వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ లెండ్ల్ సిమన్స్ (Lendl Simmons) 67 పరుగులతో అజేయంగా చివరి వరకూ నిలవడంతో విండీస్ మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే 171 లక్ష్యాన్ని ఛేదించారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమం అయింది.

భారత్ ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడటం, మిస్‌ఫీల్డ్స్ ఎక్కువగా చేయడం ద్వారా ఈ మ్యాచ్ ను చేజార్చుకుంది. వెస్టిండీస్‌కు ఈ మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన సిమన్స్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి సర్కిల్ లోనే గాల్లోకి లేపాడు. సులభమైన ఈ క్యాచ్‌ను భారత ఫీల్డర్ వాషింగ్టన్ సుందర్ జారవిడిచాడు. అప్పటికీ సిమన్స్ స్కోరు 10 బంతుల్లో ఆరు మాత్రమే. వాషింగ్టన్ సుందర్ తొలి మ్యాచ్ లోనూ క్యాచ్‌లు జారవిడిచాడు. ఆ తర్వాత అదే ఓవర్లో లూయిస్ క్యాచ్‌ను కూడా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వదిలివేశాడు. ఈ అవకాశాలను చక్కగా వినియోగించుకున్న ఈ జోడి, 73 పరుగుల ఉత్తమ ఒపెనింగ్ భాగస్వామ్యాన్ని జోడించింది.

హైదరాబాద్ మ్యాచ్‌లో కోహ్లీ దూకుడు ముందు, భారత ఫీల్డింగ్ తప్పిదాలు బయటపడలేదు కానీ, ఈ మ్యాచ్‌లో అవి తేలిపోయాయి. మొత్తం నాలుగు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు జారవిడిచారు.

అంతకుముందు, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో భారత్ 170/7 స్కోర్ చేయగలిగింది. మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శివం దుబే, కెప్టెన్ కోహ్లీ నమ్మకాన్ని నిలబెడుతూ 30 బంతుల్లో 54 పరుగులు చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అయిన దుబే ఈ మ్యాచ్‌లో ఎన్నో చూడ చక్కని షాట్లు ఆడుతూ ఒకప్పటి యువరాజ్ సింగ్‌ను తలపించాడు. రిషబ్ పంత్ 33 * రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా భారత బ్యాట్స్‌మెన్ అందరూ 20 పరుగుల లోపే స్కోర్ చేశారు.

ఇక నిర్ణయాత్మక మూడో టీ20 డిసెంబర్ 11న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనుంది.

(The above story first appeared on LatestLY on Dec 09, 2019 08:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).