AP's COVID Report: ఆంధ్రప్రదేశ్లో 6 లక్షలు దాటిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో కొత్తగా మరో 8,702 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5177కు పెరిగిన కరోనా మరణాలు
నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 10,712 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5,08,088 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 88,197 ఆక్టివ్ కేసులు ఉన్నాయని....
Amaravati, September 17: ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది, ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య గురువారం 6 లక్షల మార్కును దాటేసింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 8,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 6,01,462కు చేరింది.
అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 5,98,567మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనావైరస్ వ్యాప్తి బీభత్సంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో కరోనావైరస్ వ్యాప్తిలో ఎలాంటి నియంత్రణ కనిపించడం లేదు. గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా 1383 కేసులు నమోదయ్యాయి.
ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా 1064 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. మరోవైపు చిత్తూరు జిల్లా నుంచి 905 కేసులు నివేదించబడ్డాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:

గడిచిన ఒక్కరోజులో మరో 72 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 5,177కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 10,712 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5,08,088 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 88,197 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
గడిచిన ఒక్కరోజులో 77,492 మంది శాంపుల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ఈరోజు వరకు రాష్ట్రంలో 48,84,371 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
(The above story first appeared on LatestLY on Sep 17, 2020 07:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

