Representational Purpose Only (Photo Credits: Wikimedia Commons)

Weather Alert: దక్షిణ పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి పైభాగంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతంలో శనివారం నాటికి కొత్తగా అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా ప్రయాణిస్తూ ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు కదలనుందని ఐఎండీ తెలిపింది.

తీరం దాటే క్రమంలో ఈ అల్పపీడన వ్యవస్థ ఉత్తర ఒడిశా పరిసరాల్లో కొంతకాలం నిలకడగా ఉంటే.. దాని ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రరూపం దాల్చిన 'డాల్ఫిన్ టైఫూన్' దక్షిణ చైనా సముద్రం వైపు ప్రయాణించడంతో.. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల కదలికలు మరింత చురుగ్గా మారాయి.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలో పిడుగులతో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

రుతుపవనాల క్రియాశీలత వల్ల రాబోయే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం నెలకొంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా శనివారం నాడు ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ అలర్ట్ జారీ చేసింది.

ప్రభావితమయ్యే జిల్లాలు & హెచ్చరికలు:

భారీ వర్షాల హెచ్చరిక: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు: పోలవరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

వాతావరణ మార్పుల దృష్ట్యా పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు విజ్ఞప్తి చేశారు.