Peddi Sudarshan Reddy Dies: హనుమకొండలోని స్వగృహంలో తీవ్ర గుండెపోటుకు గురైన నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్రెడ్డి (52) గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో ఐదు రోజుల పాటు వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడిన ఆయన.. అర్ధరాత్రి 12.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగాను, బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనూ శోకసంద్రం నెలకొంది.
ఈ నెల 26న తీవ్రమైన ఛాతీ నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సమయంలో సుదర్శన్రెడ్డి కార్డియాక్ అరెస్ట్కు గురయ్యారు. వైద్యులు దాదాపు గంటపాటు శ్రమించి, తొమ్మిది సార్లు సీపీఆర్ చేసి గుండె స్పందనను పునరుద్ధరించినప్పటికీ.. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి విషమించింది. ఆ తర్వాత సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి బ్రెయిన్ ఎంఆర్ఐ, ఈసీజీ పరీక్షలు నిర్వహించగా మెదడు తీవ్రంగా దెబ్బతిన్నట్లు నిర్ధారణ అయింది. నాడీ స్పందనలు పూర్తిగా క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.
జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై సస్పెన్షన్ వేటు.. న్యాయం కోసం వచ్చిన మహిళపై దారుణం..
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పెద్ది సుదర్శన్రెడ్డి 1974లో నల్లబెల్లి మండలంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. కాంగ్రెస్తో రాజకీయ ఓనమాలు దిద్దిన ఆయన.. 2001లో కేసీఆర్ సిద్ధాంతాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో చేరారు. అదే ఏడాది నల్లబెల్లి జడ్పీటీసీగా ఘన విజయం సాధించి నియోజకవర్గంలో పట్టు సాధించారు. ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన సేవలను గుర్తించిన పార్టీ, 2015లో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్గా బాధ్యతలు అప్పగించింది. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజాప్రతినిధిగా విశేష సేవలు అందించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక ఆప్తమిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మలిదశ తెలంగాణ పోరాటంలోనూ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమంలోనూ తనతో కలిసి నడిచిన జ్ఞాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. "పెద్దిని కాపాడుకోవడానికి పార్టీ పరంగా మేము చేసిన విశ్వప్రయత్నాలు, వైద్యులు చేసిన తీవ్ర కృషి ఫలించకపోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. తెలంగాణ సాధననే శ్వాసగా భావించి, నీతి నిజాయితీలతో సాగిన ఆయన రాజకీయ ప్రస్థానం ప్రశంసనీయం" అని వ్యాఖ్యానించారు.
పోరాటాల గడ్డ అయిన నర్సంపేటలో బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేసి, ధైర్యంతో పోరాడిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ కొనియాడారు. "తెలంగాణ ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు పార్టీ అడుగుజాడల్లో నడుస్తూ, నియోజకవర్గ అభివృద్ధిలో తనకంటూ చెరగని ముద్ర వేశారు. పోలీసుల ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు ఏనాడూ భయపడలేదు. ఆయన క్రమశిక్షణ, విధేయత బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు" అని అన్నారు.
పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయన భార్యాపిల్లలకు మరియు కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.