World Earth Day 2021: పిల్లలకు ఆస్తులను పంచడమే కాదు, పర్యావరణం పట్ల అవగాహనను పెంపొందించాలి! రాష్ట్ర ప్రజలకు ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన టీఎస్ సీఎం కేసీఆర్
విశ్వవ్యాప్తంగా రోజు రోజుకూ తలెత్తుతున్న వాతావరణ మార్పులు తద్వారా మానవ జాతికి కలుగుతున్న కీడు మనిషి స్వయంకృపారాధమనే విషయాన్ని అందరమూ ఇప్పటికైనా గ్రహించాలన్నారు. కరోనా వంటి మహమ్మారీ రోగాలతో ధరిత్రికి పొంచి ఉన్న ప్రమాదాలపై అవగాహన పెంచుకొని...
Erravalli, April 22: ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అంటే..‘మనం జన్మించిన భూమి స్వర్గం కంటే గొప్పది’ అని రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పిన సూక్తిని మనం నివసిస్తున్న ప్రాంతం పట్ల అభిమానాన్ని పెంచుకొని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరమున్నదన్నారు. మనం పుట్టిన ఊరు పట్టణం ఏదైనా, మనం నివసిస్తున్న ప్రాంతాన్ని కాలుష్యరహితంగా,పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రతి తెలంగాణ పౌరుడు ప్రతిజ్ఞ చేయాలని సీఎం పిలుపునిచ్చారు.
ధరిత్రీ రక్షణ చర్యల్లో భాగంగా తెలంగాణను పచ్చగా మార్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న‘‘తెలంగాణకు హరితహారం’’ కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్నదని సీఎం తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. తాగునీరు సాగునీరు లేక కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ నేలలో నేడు అడుగడుగునా జీవ జలం ప్రవహిస్తున్నదన్నారు. ప్రాజెక్టులు కట్టి, కాల్వలతో నదీ జలాలలను సుదూర ప్రాంతాలకు తెలంగాణ వ్యాప్తంగా పల్లె పల్లెకూ తరలించడం ద్వారా చెరువులు కుంటలు నిండి భూగర్భ జలాలు సమృద్దిగా పెరిగాయన్నారు. తద్వారా పంటలకు, మనుషులకే కాకుండా పశు పక్షాదులకు మేలుజరిగి తెలంగాణ నేలమీద ప్రకృతి సమసతుల్యత సాధించగలిగామని తెలిపారు.
నేడు తెలంగాణ అంతటా జల లభ్యత పెరగడంతో పచ్చదనం పరిఢవిల్లుతూ వాతావరణం చల్లబడడం వంటి గుణాత్మక మార్పులకు చోటుచేసుకుంటున్నాయన్నారు. పక్షులు తిరిగి చెరువులను కుంటలను ఆశ్రయిస్తూ చెట్లమీద వాలుతూ కిల కిలారావాలతో తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయని తద్వారా జీవవరణాన్ని తిరిగి తెలంగాణలో సాధించగలిగామన్నారు. తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన నాటినుంచి ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యలు ఈ భూగోళంలో భాగమైన తెలంగాణ ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చేందుకు దోహదపడ్డాయని సీఎం వివరించారు.
విశ్వవ్యాప్తంగా రోజు రోజుకూ తలెత్తుతున్న వాతావరణ మార్పులు తద్వారా మానవ జాతికి కలుగుతున్న కీడు మనిషి స్వయంకృపారాధమనే విషయాన్ని అందరమూ ఇప్పటికైనా గ్రహించాలన్నారు. కరోనా వంటి మహమ్మారీ రోగాలతో ధరిత్రికి పొంచి ఉన్న ప్రమాదాలపై అవగాహన పెంచుకొని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన పిల్లలకోసం కేవలం డబ్బు సంపాయించడం ఆస్తులు కూడబెట్టడం మాత్రమే మనం చేయాల్సిన పనికాదన్నారు. ధరిత్రి సంరక్షణ పట్ల మనం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తే..భవిష్యత్తు తరాలకు మనం అంత ఆనందం పంచినవాల్లమౌతామని, గుణాత్మక జీవనాన్ని అందించిన వారమౌతామని సీఎం రాష్ట్ర ప్రజలకు ధరిత్రీ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు.
(The above story first appeared on LatestLY on Apr 22, 2021 03:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

