Karnataka Assembly Election 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు, 224 స్థానాలకు బరిలో 2,613 మంది అభ్యర్థులు, ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, మే 10వ తేదీన పోలింగ్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో.. పోటీలో మిగిలిన అభ్యర్థుల సంఖ్యల్ని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 2,613 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
Bengaluru, April 25: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో.. పోటీలో మిగిలిన అభ్యర్థుల సంఖ్యల్ని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 2,613 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్న 2,613 మంది అభ్యర్థుల్లో.. 2,427 మంది పురుష అభ్యర్థులు ఉన్నారు. 185 మంది మహిళలు, ఇతర అభ్యర్థులు ఒకరు ఉన్నారు. వీరిలో బీజేపీ నుంచి 224, కాంగ్రెస్ నుంచి 223, జనతాదళ్ ఎస్(జేడీఎస్) నుంచి 207, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 209, 133 మంది బీఎస్పీ, సీపీఐ నుంచి నలుగురు, జేడీయూ నుంచి ఎనిమిది, ఎన్పీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్పార్టీస్(RUPP) కింద 685 మంది బరిలో నిల్చున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు 918 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఈ ఎన్నికల్లో 16 నియోజకవర్గాల్లో.. 15 మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాబట్టి, అక్కడ రెండు బాలెట్ యూనిట్(BU)లను పోలింగ్ కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజు 517 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లకు రెబల్పోరు ఉండొచ్చని తెలుస్తోంది.
మే 10వ తేదీన 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఒకే దఫాలో పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.మే 24వ తేదీతో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుంది. అంతకు ముందే కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది.
(The above story first appeared on LatestLY on Apr 25, 2023 12:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

