Shoot Them at Sight: 'కనిపించిన చోటే కాల్చిపారేయండి'. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆస్తుల విధ్వంసానికి పాల్పడేవారిని అక్కడే కాల్చేయండి అంటూ మంత్రి సురేశ్ అంగాడీ వ్యాఖ్యలు
సంబంధిత జిల్లా పరిపాలన మరియు రైల్వే అధికారులను హెచ్చరిస్తున్నాను, ఎవరైనా రైల్వేతో సహా ఎలాంటి ప్రజా ఆస్తులను ధ్వంసం చేసినా, వారిని అక్కడిక్కడే కాల్చేయండి, ఒక మంత్రిగా నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను" అంటూ మీడియా ముఖంగా అన్నారు మంత్రి సురేశ్ అంగాడి.....
New Delhi, December 18: పౌరసత్వ సవరణ చట్టం (CAA) కు వ్యతిరేకిస్తూ ఎవరైనా ఆస్తుల విధ్వంసానికి పాల్పడితే వారిని కనిపించిన చోటే కాల్చిపారేయండంటూ కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి సురేష్ అంగాడీ (Suresh Angadi) ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశమయ్యాయి.
పౌరసత్వ సవరణ చట్టం ఏ మతానికి, ముస్లింలకు కూడా నష్టం చేసేది కాదు, ఈ చట్టం ఎవరి హక్కులను హరించివేయదు ఒకసారి ఆ చట్టాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోండి అంటూ ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా, సిఎఎకు వ్యతిరేకంగా నిరసనలు మాత్రం ఆగడం లేదు.
ఇలాంటి సందర్భంలో 'కనిపిస్తే కాల్చేయండి' (Shoot Them at Sight) అంటూ మోదీ ప్రభుత్వంలోని ఒక మంత్రి వ్యాఖ్యానించడం మరింత వివాదాస్పదం అవుతుంది.
పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది చట్టం చేయబడిన తర్వాత కొన్ని వర్గాల ప్రజల్లో ఆగ్రహావేశాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో పలుచోట్ల ఆస్తుల విధ్వంసం జరిగింది, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, పశ్చిమబెంగాల్ లలో నిరసనకారులు రైల్వేస్టేషన్లకు నిప్పుపెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి సురేష్ అంగాడీ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తానీలకు పౌరసత్వం ఇవ్వండి! ప్రతిపక్షాలు చేసే రాజకీయాల్లో పావులుగా మారొద్దని విద్యార్థులకు ప్రధాని మోదీ హితవు
దేశవ్యాప్తంగా గల 13 లక్షల రైల్వే ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకోవడమే కాకుండా, ప్రజా ఆస్తులకు నష్టం జరగకుండా చూసుకోవడం తన బాధ్యత అని మంత్రి అంగాడి అన్నారు. ఈ ఆస్తులు ప్రజలవి, ప్రజలు టాక్స్ కట్టడం ద్వారా వచ్చినవి, వీటినెలా ధ్వంసం చేస్తారని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి హింసాత్మక చర్యలను ఎక్కడికక్కడే అణిచివేయాలని చెప్పారు.
"సంబంధిత జిల్లా పరిపాలన మరియు రైల్వే అధికారులను హెచ్చరిస్తున్నాను, ఎవరైనా రైల్వేతో సహా ఎలాంటి ప్రజా ఆస్తులను ధ్వంసం చేసినా, వారిని అక్కడిక్కడే కాల్చేయండి, ఒక మంత్రిగా నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను" అంటూ మీడియా ముఖంగా అన్నారు మంత్రి సురేశ్ అంగాడి.
'Shoot Them at Sight': Watch MoS Railways Controversial Remark
#WATCH Union Min of State of Railways, Suresh Angadi speaks on damage to properties. Says "...I strictly warn concerned dist admn&railway authorities, if anybody destroys public property, including railway, I direct as a Minister, shoot them at sight..." #CitizenshipAmendmentAct pic.twitter.com/VeUpZY7AjX
— ANI (@ANI) December 17, 2019
ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తూ రూపొందించిన చట్టం గతవారం పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత తొలుత ఈశాన్య రాష్ట్రాలలో ప్రారంభమైన నిరసనలు ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు పాకాయి. ఇటీవల దిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాదిలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మరియు కేరళలోని పలుచోట్ల CAAకు వ్యతిరేకంగా కొన్ని వర్గాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Dec 18, 2019 09:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

