Shayani Ekadashi (Photo Credits: File Image)

Shayani Ekadashi: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో శయని ఏకాదశి ఒకటి. దీనినే తొలి ఏకాదశి, దేవశయని ఏకాదశి లేదా మహా ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్తారని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర దినం నుంచే నాలుగు నెలల పాటు కొనసాగే 'చాతుర్మాసం' ప్రారంభమవుతుంది. ఈ సమయం ఆధ్యాత్మికంగా ఎంతో శ్రేష్ఠమైనప్పటికీ.. ఈ నాలుగు నెలల కాలంలో ఎలాంటి శుభకార్యాలు, శుభ ముహూర్తాలు ఉండవు. సనాతన ధర్మంలో భక్తులు ఈ కాలమంతా ఎంతో నియమనిష్టలతో గడుపుతారు. దేవ శయని ఏకాదశి పండుగ ఈ ఏడాది జులై 25వ తేదీన రానుంది.

సాధారణంగా ప్రతి నెలా రెండు పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అయితే చాలామందికి ఏకాదశి అనగానే తొలి ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి మాత్రమే ప్రధానంగా గుర్తుంటాయి. ప్రతి ఏకాదశికీ దానికదే ప్రత్యేకత ఉన్నప్పటికీ.. హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశేషంగా పరిగణిస్తారు. అవేంగంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి), కార్తీక శుద్ధ ఏకాదశి, పుష్య శుద్ధ ఏకాదశి, మాఘ శుద్ధ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి).

ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించేటప్పుడు కొన్ని ముఖ్యమైన ఆచారాలు పాటించాలి. విష్ణుమూర్తికి తులసిదళం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి పూజలో తులసీదళాలను తప్పనిసరిగా సమర్పించాలి, లేనిచే ఆరాధన అసంపూర్ణంగానే భావిస్తారు. ఏకాదశి నాడు భక్తులు ఉపవాస దీక్ష చేపట్టి, విష్ణు సహస్రనామ పఠనం చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు కూడా ఆ రోజు అన్నం తినకూడదు. అలాగే సుగంధ ద్రవ్యాలు, మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, గుడ్లు వంటి తామసిక ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఉపవాసం ఉండేవారు తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ మనసును ప్రశాంతంగా, భగవంతునిపైనే కేంద్రీకరించాలి.

దేవశయని ఏకాదశి 2026.. శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర రోజు.. ఈ రోజును ఎందుకు అత్యంత పవిత్రంగా భావిస్తారు?

దీనితో పాటు ఏకాదశి నాడు వస్త్రాలు, అన్నం, నీరు, ధనం వంటివి దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. శరీరాన్ని, మనస్సును అదుపులో ఉంచుకుంటూ కచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇక ఈ పవిత్రమైన రోజున మహారాష్ట్రలోని ప్రసిద్ధ పంఢరపూర్ విఠోబా ఆలయానికి వేలాదిమంది భక్తులు పాదయాత్రగా తరలివెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించడం మరొక విశేషమైన సంప్రదాయం.

దేవశయని ఏకాదశి నాడు చేయకూడని పనులు

దేవశయని ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి భక్తులు ఈ రోజున కొన్ని ముఖ్యమైన నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి ఆకులను ఈ రోజున పొరపాటున కూడా కోయకూడదు. హిందూ సంప్రదాయంలో ఏకాదశి నాడు తులసి ఆకులు తెంపడం తీవ్రమైన పాపంగా పరిగణించబడుతుంది. అందువల్ల పూజ కోసం తులసి దళాలు కావాలనుకునేవారు వాటిని ఏకాదశికి ఒక రోజు ముందుగానే కోసి సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా, ఈ పవిత్ర తిథి నాడు తులసి అమ్మవారు శ్రీమహావిష్ణువు కోసం నిర్జల (జలరహిత) వ్రతాన్ని పాటిస్తారని నమ్ముతారు. కాబట్టి దేవశయని ఏకాదశి రోజున తులసి మొక్కకు నీరు పోయడం కూడా నిషేధం.

ఆహార నియమాల విషయంలోనూ భక్తులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలను పూర్తిగా వర్జించాలి. అలాగే ధాన్యాలు, ముఖ్యంగా అన్నం తినడం మానుకుని, కేవలం పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. శారీరక శుద్ధితో పాటు మానసిక శుద్ధి కూడా అంతే ముఖ్యం కాబట్టి, ఎవరిపట్లా తప్పుడు ఆలోచనలు చేయకుండా రోజంతా మనస్సును అదుపులో ఉంచుకుంటూ బ్రహ్మచర్యం పాటించాలి.

దుస్తుల ఎంపికలోనూ కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. దేవశయని ఏకాదశి నాడు పాతవి, మురికిగా ఉన్నవి లేదా నల్లని రంగు బట్టలు ధరించకూడదు. అటువంటి వస్త్రాలు ప్రతికూల శక్తిని పెంచుతాయని విశ్వసిస్తారు కాబట్టి, భక్తులు పరిశుభ్రమైన, మంగళకరమైన వస్త్రాలను ధరించి భగవంతుని ఆరాధనలో పాల్గొనడం శ్రేయస్కరం.