When is Guru Purnima? మన సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత అత్యున్నత స్థానం గురువుదే. అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే గురువును దైవంతో సమానంగా పూజించే పవిత్రమైన రోజు గురు పూర్ణిమ. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకుంటాం. ఈ ఏడాది జూలై 29న జరుపుకుంటున్నాం. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. దీని వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది. సనాతన ధర్మంలో ఆదిగురువుగా భావించే మహర్షి వేద వ్యాసుడు ఆషాఢ పౌర్ణమి నాడే జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. వశిష్ట మహర్షి మనవడు, పరాశర మహర్షి, సత్యవతి దేవిల పుత్రుడైన వ్యాసుడు చిన్నతనంలోనే తపస్సు కోసం అడవులకు వెళ్లాడు.
నాలుగు వేదాల వర్గీకరణ : పూర్వం అనంతమైన జ్ఞానరాశిగా ఉన్న వేదాలను సామాన్య ప్రజలు అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. దాంతో వ్యాస మహర్షి తన అపారమైన జ్ఞానంతో ఆ వేద రాశిని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అని నాలుగు భాగాలుగా వర్గీకరించారు. అందుకే ఆయనకు వేద వ్యాసుడు అనే పేరు వచ్చింది. అంతేకాకుండా.. మానవాళికి ధర్మ సందేశాన్ని అందించడానికి 18 పురాణాలు, ఉపపురాణాలు, సమగ్ర జీవన వేదమైన 'మహాభారతం'ను రచించారు. మానవాళికి అపారమైన జ్ఞాన సంపదను గురువుగా అందించినందుకు గాను ఆయన జన్మదినాన్ని లోకమంతా గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
గౌతమ బుద్ధుని ప్రథమ ఉపదేశం: బౌద్ధ సంప్రదాయంలోనూ ఈ రోజుకు ఒక విశిష్టమైన కథ ఉంది. సిద్ధార్థుడు బుద్ధుడిగా జ్ఞానోదయం పొందిన తర్వాత, తన వద్ద ఉన్న జ్ఞానాన్ని లోకానికి పంచాలని నిర్ణయించుకున్నాడు. ఆషాఢ పౌర్ణమి నాడే ఆయన సారనాథ్లోని జింకల వనంలో (సారనాథ్ డీర్ పార్క్) తన ఐదుగురు పూర్వ శిష్యులకు ప్రథమంగా ధర్మోపదేశం చేశారు. ఈ సంఘటననే బౌద్ధంలో ధర్మచక్ర ప్రవర్తన అంటారు. అలా బుద్ధుడు గురువుగా మారి ధర్మ బోధన ప్రారంభించిన రోజు కాబట్టి బౌద్ధులు కూడా ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు.
తొలి యోగిగా పరమశివుడు: యోగా సంప్రదాయం ప్రకారం, పరమశివుడు ఆదియోగిగా మారి, తన జ్ఞానాన్ని సప్తర్షులకు (ఏడుగురు మహర్షులు) బోధించడం ప్రారంభించిన రోజు కూడా ఈ ఆషాఢ పౌర్ణమేనని నమ్ముతారు. కాంతికాంతిగా మారిన శివుడు వారిని శిష్యులుగా స్వీకరించి, యోగ విద్యను ఉపదేశించి 'ఆదిగురువు'గా మారాడు.
ప్రాముఖ్యత : గురు పూర్ణిమ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. మన జీవితంలో నైతిక, ఆధ్యాత్మిక, విద్యారంగాల్లో దారి చూపించిన ప్రతి గురువుకూ కృతజ్ఞతలు తెలిపే శుభదినం. ఈ రోజున గురువులను దర్శించుకుని, వారి ఆశీస్సులు పొందడం ప్రతి శిష్యుడి బాధ్యతగా భావిస్తారు.