Needles in Head: రోగం తగ్గిస్తానని యువతి తలలోకి 77 సూదులు గుచ్చిన మాంత్రికుడు.. తలనొప్పితో దవాఖానలో చేరిన యువతి.. టెస్టుల్లో బయటపడ్డ దారుణం.. ఒడిశాలో జరిగిన ఈ ఉదంతంలో తర్వాత ఏం జరిగింది?
మూఢనమ్మకాలు గుడ్డిగా నమ్మవద్దని, వాటిని నమ్మి ప్రాణాపాయం తెచ్చుకోవద్దని మీడియాలో వైద్యనిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు మారట్లేదు.
Newdelhi, July 20: మూఢనమ్మకాలు (Black Magic) గుడ్డిగా నమ్మవద్దని, వాటిని నమ్మి ప్రాణాపాయం తెచ్చుకోవద్దని మీడియాలో (Media) వైద్యనిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు మారట్లేదు. దీంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదీ అలాంటి ఘటనే. అనారోగ్యంతో ఉన్న యువతికి రోగాన్ని నయం చేయిస్తానని నమ్మించి ఆమె తలలో 77 సూదులు గుచ్చిన ఓ మాంత్రికుడి ఉదంతం ఒడిశాలో సంచలనంగా మారింది. బొలంగీర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇచ్ గావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహారా (19) మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది. మందులు వాడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో, ఆమె తండ్రి బిష్ణు బెహారా.. తేజ్ రాజ్ రాణా అనే మాంత్రికుడిని సంప్రదించారు. కుమార్తెకు రోగాన్ని నయం చేయించాలని అభ్యర్థించాడు.
అలా వెలుగులోకి
దీంతో వైద్యం పేరిట తేజ్ రాజ్ పలు దఫాలుగా రేష్మా తలలోకి 77 సూదులను గుచ్చాడు. అయినప్పటికీ, ఆమె రోగం నయం కాలేదు. పైగా ఆమెకు తీవ్రమైన తలనొప్పి రావడం మొదలైంది. దీంతో తలనొప్పితో బాధపడుతున్న యువతిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం వైద్యులు ఆమెకు సిటీ స్కానింగ్ చేసి నిర్ఘాంతపోయారు. ఆమె పుర్రెపై సూదులు ఉన్నట్టు గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేశారు.
అలా బయటపడి
దాదాపు గంటన్నర పాటు శ్రమించి యువతి తలలోని 77 సూదులను వైద్యులు బయటకు తీశారు. పుర్రె ఎముకపై ఉన్న సూదులు లోపలికి వెళ్లకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడిందని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై పోలీసులు మాంత్రికుడిని అరెస్టు చేశారు.
(The above story first appeared on LatestLY on Jul 21, 2024 08:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

