YSR Nethanna Nestham: వారికి రూ. 24 వేలు అకౌంట్లోకి వచ్చేశాయి, వైయస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్
వెంకటగిరిలో వైఎస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. అర్హులై ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంగతి విదితమే.
Venkatagiri, July 21: వెంకటగిరిలో వైఎస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. అర్హులై ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా నేడు తిరుపతి వెంకటగిరిలో ఐదో విడత నిధులను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది నేతన్నలకు రూ. 193.64 కోట్లను నేడు బటన్ నొక్కి.. లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు సీఎం జగన్మోహన్రెడ్డి.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి వైఎస్సార్ నేతన్ననేస్తం ద్వారా రూ.967.77 కోట్లు అందించింది. ఇదిగాక.. నేతన్నల పెన్షన్ కోసం రూ. 1.396 కోట్లు, ఆప్కోకు మరో రూ.468.84 కోట్లు.. మొత్తం ఇప్పటివరకు ఈ మూడింటి ద్వారా రూ. 2,835.06 కోట్లు అందించింది.వైఎస్సార్నేతన్న నేస్తం ద్వారా ఇప్పటిదాకా జగన్ ప్రభుత్వం ప్రతీ నేతన్నకు అందించిన మొత్తం సాయం రూ.1, 20,000 వేల కోట్లు. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా.. చేనేత కార్మికులు తమ మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్గ్రేడ్ చేసి కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ తమ జీవితాలను మెరుగుపర్చుకుంటున్నారు.
నేతన్న నేస్తం నిధుల జమ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగిస్తూ.. వలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మంచి చేస్తున్న వ్యవస్థలను, మంచి చేసే మనుషులనూ సంస్కారం ఉన్న ఎవరూ విమర్శించరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు.
వలంటీర్లు రాష్ట్రంలోని ప్రతి గడపకు సేవలందిస్తున్నారు. ఎండ, వాన, వరదలను లెక్క చేయకుండా పని చేస్తున్నారు. ఉదయాన్నే తలుపు తట్టి మంచి చెడులు అడితే వాళ్లు. అవినీతి, వివక్ష తెలియని మంచివాళ్లు వలంటీర్లు. వాళ్లంతా మన గ్రామం పిల్లలే.. మన వాళ్లే. అలాంటి వాళ్లపై అన్యాయంగా బురద జల్లుతున్నారు. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వలంటీర్లను అవమానించరు అని సీఎం జగన్ ఉద్ఘాటించారు.
అక్క చెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్లు ఇచ్చిన చరిత్ర మనది. 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న చరిత్ర మనది. డీబీటీ ద్వారా రూ. 2.25 లక్షల కోట్లు అందించిన ఘనత మనది. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మహిళా సాధికారత విషయంలో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయం చేశాం. 98 శాతం హామీలను అమలు చేసిన చరిత్ర మనది.26 జిల్లాలను చేసిన చరిత్ర మనది.2 లక్షల 6 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన చరిత్ర మనది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను ఆదుకున్నాం.., రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టుల నిర్మాణం చేసిన చరిత్ర మనది.మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్న చరిత్ర మనది అని సీఎం జగన్ తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jul 21, 2023 01:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

