Andhra Pradesh: సస్యశ్యామలం కానున్న రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలు, అవుకు రెండో టన్నెల్ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ను సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం జాతికి అంకితం చేశారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు.
నంద్యాల, నవంబర్ 30: రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ను సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం జాతికి అంకితం చేశారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు.
అవుకు సొరంగాల పనులకు వైఎస్సార్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. తాజాగా ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం.
ఇక కేవలం 1.275 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే.
శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటిని అందించే దివంగత వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు.
మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. వైఎస్సార్ హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి.
(The above story first appeared on LatestLY on Nov 30, 2023 02:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

