Adudam Andhra: ఐపీఎల్కు ఏపీ నుంచి త్వరలో మెగా టీం, సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్, భవిష్యత్తులో చెన్నై, ముంబై జట్ల సహాయం తీసుకుంటామని వెల్లడి
పీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో క్రీడలు, యువజన సర్వీసులశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబురాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
Tadepalli, June 16: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో క్రీడలు, యువజన సర్వీసులశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబురాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతీ ఏటా ఈ ఆటల పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.
అంబటి రాయుడు, కేఎస్ భరత్ సేవలను మనం వినియోగించుకోవాలన్నారు. పోటీల కోసం ప్రతీ మండలంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామం/వార్డు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు.
క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబాడీ, ఖో–ఖో పోటీలు నిర్వహిస్తారు. బాలురు, బాలికలకు పోటీలతో పాటుగానే, 3 కి.మీ మారథాన్, యోగా, టెన్నీకాయిట్, సంప్రదాయ ఆటల పోటీలు ప్రభుత్వం నిర్వహించనుంది. సచివాలయాల స్థాయిలో మొదలుకుని, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మ్యాచ్లు జరుగనున్నాయి. మొత్తం 46 రోజులపాటు ఆటలు కొనసాగుతాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ గ్రౌండ్లు, మున్సిపల్ స్టేడియంలు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూనివర్సిటీ గ్రౌండ్లు తదితర మైదానాల్లో పోటీలు జరుగనున్నాయి.
నియోజకవర్గానికో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో నిర్వహించే క్రీడా సంబరాలు ఏటా నిర్వహించాలి. ఇందుకోసం ప్రతి మండలంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి. గ్రామ స్థాయిలో అడే వారికి క్రీడా సామగ్రి అందించాలి. విజేతలకు బహుమతులతో పాటు కిట్లు ఇవ్వాలి. సచివాలయానికి కూడా భవిష్యత్తులో కిట్లు ఇచ్చే ఆలోచనలు చేయాలి. ఉన్నత పాఠశాలలు, ఆపై స్థాయిలో తప్పనిసరిగా క్రీడా సామగ్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలో క్రికెట్ ఆటకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మార్గనిర్దేశం చేయనుందని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. భవిష్యత్తులో ఏపీ నుంచి ఒక ఐపీఎల్ టీం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మూడు క్రికెట్ మైదానాలను క్రికెట్ శిక్షణ కార్యక్రమాల కోసం చెన్నై సూపర్ కింగ్స్కు అప్పగిస్తాం. అంబటి రాయుడు, కేఎస్ భరత్ లాంటి వారు రాష్ట్ర యువకులకు స్ఫూర్తిదాయకం. క్రికెట్ జట్టు తయారీకి వారి సేవలు వినియోగించుకోవాలి. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ లాంటి జట్ల సహాయం కూడా తీసుకుంటాం. దీనివల్ల ప్రొఫెషనలిజం బాగా పెరుగుతుంది’ అని సీఎం అన్నారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి, ఐటీశాఖ మంత్రి అమర్నాథ్, క్రీడలు, యువజన సర్వీసులశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(The above story first appeared on LatestLY on Jun 16, 2023 06:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

