Tirumala: తిరుమలలో రికార్డు స్థాయిలో టీటీడీ హుండీ ఆదాయం, మే నెలలో రూ.130.29 కోట్లు వచ్చిందని తెలిపిన టీటీడీ, ఆగస్టు 7 న టీటీడీ ఉచిత సాముహిక వివాహాలు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మే నెలలో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో అక్షరాలా రూ.130.29 కోట్లు (Tirumala hundi nets ₹130.29) వచ్చింది. మే నెలకు సంబంధించి 22 లక్షల 62 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
Tirupati, June 10: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మే నెలలో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో అక్షరాలా రూ.130.29 కోట్లు (Tirumala hundi nets ₹130.29) వచ్చింది. మే నెలకు సంబంధించి 22 లక్షల 62 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. లడ్డూ విక్రయాలు 1.86 కోట్లు జరిగాయి. భక్తుల సౌకర్యార్థం టైమ్ స్లాట్ సర్వదర్శన విధానాన్ని పున:ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే గడిచిన కొద్ది రోజులుగా స్వామివారి హుండీ ఆదాయం (Tirumala hundi nets) రోజుకు రూ.4 కోట్లుగా ఉంటుంది. రద్దీ రోజుల్లో ఈ మొత్తం రూ.5 కోట్లు దాటుతోంది. కరోనా కారణంగా తగ్గిన హుండీ ఆదాయం ఇప్పుడు భక్తుల రాకతో మళ్లీ సిరులతో కళకళలాడుతోంది.
కాగా భక్తుల సౌకర్యార్ధం టైంస్లాట్ సర్వదర్శన విధానం పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సమస్యలు తలెత్తకుండా తిరుపతిలో (Tirupati) టైంస్లాట్ టోకెన్లు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని త్వరలో వీటిని భక్తులకు జారీ చేస్తామని వివరించారు. 2019లో టీటీడీ పథకాలకు 308 కోట్లు రాగా 2021లో రూ.564 కోట్లు వచ్చాయని పేర్కొన్నారు.
తిరుమల దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో ఉచిత సామూహిక వివాహాలు జరుగనున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ సామూహిక వివాహాలు జరిపించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. పేదింటి పిల్లల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఈ ఉచిత సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టినట్లు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న రోజుల్లో కళ్యాణమస్తు పేరుతో ఉచిత సామూహిక వివాహాలు జరిపించారని ఆయన గుర్తు చేశారు.
పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించనున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆగస్టు 7వ తేదీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఆదివారం ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో వివాహాలు జరిపించాలని పండితులు సుముహూర్తం నిర్ణయించారని వెల్లడించారు.
అర్హులైన వారు తమ తమ జిల్లాల కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే కూడా టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. వైఎస్సార్ తీసుకొచ్చిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని సీఎం జగన్ ఆదేశాలతో పునఃప్రారంభించడం సంతోషంగా ఉన్నదని సుబ్బారెడ్డి వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Jun 10, 2022 03:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

