AP Municipal Polls: మార్చి 10వ తేదీ అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించండి, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ, గవర్నర్ను కలిసిన ఏపీ ఎన్నికల కమిషనర్, మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసి మునిసిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు (AP Municipal Polls) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కీలక ఆదేశాలను జారీ చేశారు.
Amaravati, Feb 23: ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసి మునిసిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు (AP Municipal Polls) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కీలక ఆదేశాలను జారీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో మార్చి 10న సెలవు దినంగా ప్రకటించాలని ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్ (మార్చి 14) రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని తెలిపారు. ఈ రెండు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను ఉయోగించుకోవాలని ఆయన (SEC Nimmagadda) చెప్పారు.
పురపాలక ఎన్నికలకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టిని సారించాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో ఈరోజు నిమ్మగడ్డ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 12 నగర పాలికలు, 75 పురపాలికలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇదిలా ఉంటే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను విజయవాడలోని రాజ్ భవన్ లొ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలిశారు. నిన్నటితో పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు జరిగిన తీరును గవర్నర్ కు ఎస్ఈసీ వివరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ గురించి కూడా గవర్నర్ కు వివరించారు. నాలుగు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల వివరాలు, ఏకగ్రీవాలు తదితర సమాచారంతో కూడిన నివేదికను గవర్నర్ కు సమర్పించినట్టు తెలుస్తోంది. దాదాపు అరగంట సేపు వీరి భేటీ కొనసాగింది.
మున్సిపల్ ఎన్నికలపై (andhra pradesh municipal polls) తీసుకోవాల్సిన చర్యలపై నిమ్మగడ్డ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. పంచాయతీ ఎన్నికలను సమర్ధంగా నిర్వహించాలని అధికారులను నిమ్మగడ్డ అభినందించారు. రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. ఇక పురపాలక ఎన్నికల్లో పోలింగ్ శాతం మరింత పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ప్రజలంతా స్వచ్చంధంగా ఎన్నికల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయానికి బ్యాలెట్ బ్యాక్స్లు, ఇతర సామాగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు.
అలాగే వెబ్ క్యాస్టింగ్, సీసీ కెమెరాలు, వీడియో గ్రఫీ ద్వారా ఎప్పటికప్పుడు నిఘా పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నోటా కూడా బ్యాలెట్లో పొందుపరుస్తున్నామని, ఎన్నికల కేంద్రాల్లో ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కాబట్టి అధికారులు మరింత దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని నిమ్మగడ్డ రమేష్ హెచ్చరించారు.
(The above story first appeared on LatestLY on Feb 23, 2021 12:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

