Pawan Kalyan In Vizag: సాయంత్రం 4 గంటలలోగా విశాఖ వదిలి వెళ్లాలని పవన్ కళ్యాణ్ కు 41 A నోటీసులు, జనవాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు, విశాఖలో వీడని ఉత్కంఠ..
విశాఖ పట్టణంలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో శనివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్పోర్టులో మంత్రులు, వైసీపీ నాయకులపై జనసేన కార్యకర్తలు దాడులు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు నేతలకు 41 A నోటీసులు జారీ చేశారు పోలీసులు.
విశాఖ పట్టణంలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో శనివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్పోర్టులో మంత్రులు, వైసీపీ నాయకులపై జనసేన కార్యకర్తలు దాడులు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు నేతలకు 41 A నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇవాళ సాయింత్రం 4 గంటలోగా నగరం/ హోటల్ నుండి వెళ్లిపోవాలన్నది నోటీసు సారాంశమని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రెస్ మీట్ లో తెలిపారు. ఇదిలా ఉంటే పవన్కల్యాణ్ బస చేసిన హోటల్లో పలువురు జనసైనికులను అదుపులోకి తీసుకున్నారు. పదుల సంఖ్యలో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ మూడు రాజధానుల కార్యక్రమానికి ముందే తమ జనవాణి కార్యక్రమం ఖరారైందని తెలిపారు. తమ పార్టీ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో, మేం ఎక్కడికి వెళ్లాలో కూడా వైసీపీ చెబుతుందా? మేం ఎక్కడికి వెళ్తామో వైసీపీ నేతలకు చెప్పాలా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు తమ దగ్గరికి ఎందుకు వస్తారని ప్రశ్నించారు.
మేము జనవాణి కార్యక్రమం నిర్వహించుకోడానికి వచ్చానని, తాము ఇక్కడ దేశ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నామా అంటూ ప్రశ్నించారు. గంజాయి సాగు చేసే వాళ్లని వదిలేసి మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలన్నారు. పోలీసులంటే తమకు ఎంతో గౌరవం ఉందని, గతంలో పోలీసులపై నమ్మకం లేదన్న వ్యక్తి కింద నేడు పోలీస్ వ్యవస్థ పనిచేయాల్సి వస్తుందని అన్నారు. పోలీసులు తమ పరిధిని దాటుతున్నారని, నిన్నటి ఘటనలో అడ్డగోలుగా ప్రభుత్వానికి కొమ్ము కాశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్పుకోసం రాజకీయాల్లోకి వచ్చానని, వైసీపీ గూండాల బెదిరింపులు తనకు కొత్తకాదని, వారి ఉడుత ఊపులకు నేను బెదిరే వ్యక్తిని కాదంటూ పవన్ ఘాటుగా హెచ్చరించారు. ఒకటే రాజధానిగా ఉండాలని మేం అనుకున్నామని, రాజు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా అంటూ పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రాలో ఘర్షణలు సృష్టించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాను ఉత్తరాంధ్రా పర్యటనకు వస్తే ప్రభుత్వ అక్రమాలు, భూకబ్జాలపై మాట్లాడతాననే ఉద్దేశంతోనే జనవాణి కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నించిందన్నారు.
వైసీపీకి పోటీగా మేము కార్యక్రమాలు నిర్వహించాలనుకోవటం లేదని, సమస్యలపైనే మాట్లాడుతామని అన్నారు. ఎన్నికల టైంలో పోటీ పెట్టుకుందామని పవన్ అన్నారు. నిన్నటి ఘటనలో అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. తమ పార్టీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని, వారు అంత పెద్ద తప్పు ఏమి చేశారని పవన్ ప్రశ్నించారు. పోలీసులు తమను రెచ్చగొడుతున్నారని, వారు పద్ధతి మానుకోవాలన్నారు. తమ పార్టీ నాయకులను విడుదల చేయకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను విడుదల చేసే వరకు జనవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
(The above story first appeared on LatestLY on Oct 16, 2022 01:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

