Tirupati Laddu Dispute: టీటీడీకి ఐదు మంది నెయ్యి సరఫరాదారులు, కంపెనీల పేర్లను వెల్లడించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు
స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు.
తిరుమల, 2024 సెప్టెంబరు 20: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంతోపాటు, ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల దైవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
తిరుమల అన్నమయ్య భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ, లడ్డూ ప్రసాదంలో నాణ్యత, రుచి ఉండేలా చూడాలని, పవిత్రతను పునరుద్ధరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్ర బాబు నాయుడు ఆదేశించినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున, స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా నూతనంగా టీటీడీ పరిపాలన బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి లడ్డూల నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం ప్రారంభించామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా లడ్డూల నాణ్యత తక్కువగా ఉందని భక్తుల నుండి అభిప్రాయాన్ని స్వీకరించిన తరువాత పోటు కార్మికులతో (లడ్డూ తయారీదారులు) మాట్లాడిన తరువాత, మొదటిసారిగా నెయ్యి శాంపుల్స్ ను పరీక్ష కోసం బయటి ల్యాబ్కు టీటీడీ పంపిందన్నారు.
మా నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదు, తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏఆర్ డెయిరీ వివరణ
టీటీడీకి ఐదు మంది నెయ్యి సరఫరాదారులు ఉన్నారన్నారు. వారి ధరలు రూ. 320 నుండి రూ. 411 మధ్య ఉన్నాయని, వారి పేర్లు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, కృపరామ్ డైరీ, వైష్ణవి, శ్రీ పరాగ్ మిల్క్, ఏఆర్ డెయిరీ. ప్రాథమికంగా ఈ రేట్లతో స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేయడానికి ముందుకు వచ్చాయన్నారు.
నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయాలని సరఫరాదారులందరినీ కోరినట్లు చెప్పారు. కల్తీ నెయ్యిని పరీక్షించడానికి నమూనాలను బయటి ల్యాబ్లకు పంపబడుతుందని, కల్తీ అని తేలితే బ్లాక్లిస్ట్ చేయనున్నట్లు వారిని హెచ్చరించినట్లు తెలిపారు. హెచ్చరించిన తర్వాత కూడా, ఏఆర్ ఫుడ్స్ పంపిన 4 నెయ్యి ట్యాంకర్లు నాణ్యత లేనివిగా ప్రాథమికంగా గుర్తించామన్నారు.
ప్రఖ్యాత ఎన్ డిడిబి సిఏఎల్ ఎఫ్ (NDDB CALF) ఆనంద్కు పంపిన నమూనాపై ఏస్-విలువ విశ్లేషణ నిర్వహించబడిందన్నారు. ఇందులో నెయ్యి నాణ్యత ప్రమాణాలు నిర్దేశించిన పరిమాణంలో లేదని నిర్ధారణ అయిందని తెలిపారు. ఇందులో సోయా బీన్, పొద్దుతిరుగుడు, palm kernel fat, lard, beef tallow వంటివి గుర్తించినట్లు చెప్పారు. స్వచ్ఛమైన పాల కొవ్వుకు ఆమోదయోగ్యమైన ఏస్-విలువ 98.05 మరియు 104.32 మధ్య ఉంటుంది, అయితే పరీక్షించిన నమూనా 23.22 మరియు 116 నుండి గణనీయ వ్యత్యాసాలను చూపిందన్నారు. ఈ నమూనాలు వెజిటబుల్ ఆయిల్ కల్తీని కూడా సూచించాయాన్నారు.
టీటీడీకి ల్యాబ్ లో అత్యాధునిక సాంకేతిక పరికరాలు లేకపోవడమే నాణ్యత లోపానికి కారణమన్నారు. సరఫరాదారులు ఈ లోపాలను ఆధారంగా చేసుకొని కల్తీ నెయ్యి సరఫరా చేశారన్నారు. ఇటువంటి కల్తీ నెయ్యి సరఫరాలను గుర్తించి అరికట్టడానికి నుడబ్ రూ. 75 లక్షల నెయ్యి కల్తీ పరీక్ష పరికరాలను విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చిందన్నారు. నూతన ల్యాబ్ ను వచ్చే డిసెంబర్ లేదా జనవరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది” అని ఆయన వివరించారు.
తాత్కాలికంగా గో ఆధారిత ముడి సరుకుల రద్దు
భక్తుల అభిప్రాయాల మేరకు తిరుమల ఆలయంలో శ్రీవారి నైవేద్య అన్నప్రసాదాలలో వినియోగించే గో ఆధారిత ముడి సరుకులైన నెయ్యి, బెల్లం, బియ్యాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు టిటిడిఈఓ తెలిపారు. ఒక నిపుణుల కమిటీని త్వరలో ఏర్పాటు చేసి వారు అందించే నివేదిక మేరకు ఈ ముడి సరుకులను శ్రీవారి నైవేద్య ప్రసాదంలో వినియోగించాలా లేదా పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు.
(The above story first appeared on LatestLY on Sep 20, 2024 08:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

