Lockdown Guidelines: లాక్‌డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, లాక్‌డౌన్ నిబంధనలు ఎలా ఉన్నాయి మరియు ఏయే రంగాలకు ప్రభుత్వం మినహాయింపు కల్పించిందో తెలుసుకోండి

ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. ఈ 4 గంటల పాటు అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. అన్ని షాపులు తెరుచుకోవచ్చు. ఈ సమయంలో మద్యం షాపులు కూడా తెరుచుకోవచ్చని...

Lockdown Guidelines: లాక్‌డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, లాక్‌డౌన్ నిబంధనలు ఎలా ఉన్నాయి మరియు ఏయే రంగాలకు  ప్రభుత్వం మినహాయింపు కల్పించిందో తెలుసుకోండి
Telangana CM K Chandrasekhar Rao | File Photo

Hyderabad, May 11: సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే అంశంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. ఈ సందర్భంగా మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి మే 21వ తేదీ వరకు 10 రోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. అయితే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. ఈ 4 గంటల పాటు అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది. అన్ని షాపులు తెరుచుకోవచ్చు. ఈ సమయంలో మద్యం షాపులు కూడా తెరుచుకోవచ్చని అబ్కారీ శాఖకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఇక ఉదయం 10 గంటల తర్వాత మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో తాజాగా 4,801 పాజిటివ్ కేసులు నమోదు, 7 వేల మందికి పైగా రికవరీ

లాక్ డౌన్ విధించే అంశంతో పాటు రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, కోవిడ్ చికిత్సకు అవసరమయ్యే ఔషధాలు, ఆక్సిజన్ సరఫరా అలాగే లాక్ డౌన్ సమయంలో ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలకు సంబంధించి కూడా కేభినేట్ చర్చించింది. సుమారు 3 గంటల పాటు సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలతో పాటు ఈ లాక్ డౌన్ కాలంలో ఏయే రంగాలకు మినహాయిపులు ఇవ్వాలని చర్చించి అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

క్యాబినెట్ నిర్ణయాలు:

➧ మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది.

➧ యుద్ధ ప్రాతిపదికన కోవిడ్ వ్యాక్సిన్ ప్రొక్యూర్‌మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.

➧ ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ ను క్యాబినెట్ ఆదేశించింది.

➧ అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం ఆదేశం.

➧ రెమిడెసివిర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో క్యాబినెట్ సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరారు.

➧ ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు:

➧ వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.

➧ తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది.

➧ వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.

➧ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.

➧ విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.

➧ జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.

➧ జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.

➧ కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు

➧ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు

➧ ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.

➧ ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.

➧ గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.

➧ అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి

➧ అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.

➧ తెలంగాణ చుట్టూ రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం

➧ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.

➧ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.

➧ కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది.

➧ సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.

➧ పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది.

మే 20వ తేదీన క్యాబినెట్ తిరిగి సమావేశం అవుతుంది. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.

(The above story first appeared on LatestLY on May 11, 2021 06:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).