Karimnagar as London: కాళేశ్వరం పూర్తైతే కరీంనగర్ లండన్లా మారుతుంది. ఈ విషయం అర్థంకాకే వక్రభాష్యాలు, కరీంనగర్ పర్యటనలో సీఎం కేసీఆర్, రాష్ట్రానికి ఏం కావాలో తమ ప్రభుత్వానికే పూర్తి అవగాహన ఉందని వెల్లడి
జూన్ లోగా మానేరు, మూలవాగు చెక్ డ్యాంలు నీటితో నింపుకోవాలి. లండన్ నగరంలో థేమ్స్ నది ఎలాగైతే సజీవంగా ఉంటుందో మానేరు నది కూడా అలాగే ఉంటుంది. తాను గతంలో ఈ విషయం చెబితే కొందరు సన్నాసులు అర్థంకాక వెకిలి నవ్వులు నవ్వారు, వక్ర భాష్యాలు చెప్పారు. జూన్ నెల తర్వాత అలా మాట్లాడిన సన్నాసులకు....
Karimnagar, December30: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (CM KCR) సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి దర్శనానికి బయలుదేరిన సీఎం కేసీఆర్ మార్గమధ్యలో సిరిసిల్ల - తంగళ్లపల్లి వంతెనపై మానేరు నదిలో కాళేశ్వరం జలాలకు పూజలు చేసి జలహారతి ఇచ్చారు. మొత్తం పర్యటన పూర్తి చేసుకున్న అనంతరం కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టలపల్లి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. సాగునీటి రంగంలో తెలంగాణ కోసం తాను కన్న కలలు సాకారమవుతున్నాయని సీఎం చెప్పారు. గోదావరి, మానేరు జలాలతో కరీంనగర్ సస్యశ్యామలమవుతుందని పేర్కొన్నారు. మిడ్ మానేర్ జలాశయం (Mid Manair reservoir ) వద్ద పూజలు చేస్తున్నప్పుడు జీవిత సాఫల్యం సాధించిన ఆనందం కలిగిందన్నారు.
సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1230 చెక్ డ్యాంలకు ప్రభుత్వం అనుమతిచ్చింది, అవి జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలచ్చినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్ భాగంగా ఉన్నటువంటి మిడ్ మానేర్ లింక్ విజయవంతంగా పూర్తైంది. దీంతో మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యాంలు నిండుగా ఉన్నాయి. దీని ప్రకారం ఈ ప్రాంతానికి కరువు పీడ శాశ్వతంగా తొలగిపోయింది. ఇక్కడి రైతులు మొగులు వైపు చూడకుండా రెండు పంటలు నిశ్చింతగా పండే అవకాశం ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గోదావారి జిల్లాలు సంపూర్ణ వివక్షకు గురయ్యాయి, తీవ్ర కరువుతో అల్లాడిపోయాయి. ఇదే జిల్లాల నుంచి రైతులు దుబాయ్, గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లారు. రాష్ట్రం సాకారమైతే ఆంధ్రాలోని గోదావరి డేల్టా కంటే అద్భుతంగా ఉంటుందని 2001లోనే చెప్పాను, ఇప్పుడు ఆ కల సాకారమైనందుకు సంతోషంగా ఉందని సీఎం అన్నారు.
రాష్ట్రాభివృద్ధి విషయంలో ఏ పార్టీకి లేని చిత్తశుద్ధి మాకు ఉంది. సాగునీటి ప్రాజెక్టులన్నీ ఎక్స్ రే కళ్లతో చూశాం. కాళేశ్వరం జలాలతో మొట్టమొదటి ప్రయోజనం కరీంనగర్ జిల్లాకే కలుగుతుంది. జూన్ లోగా మానేరు, మూలవాగు చెక్ డ్యాంలు నీటితో నింపుకోవాలి. లండన్ నగరంలో థేమ్స్ నది ఎలాగైతే సజీవంగా ఉంటుందో మానేరు నది కూడా అలాగే ఉంటుంది. తాను గతంలో ఈ విషయం చెబితే కొందరు సన్నాసులు అర్థంకాక వెకిలి నవ్వులు నవ్వారు, వక్ర భాష్యాలు చెప్పారు. జూన్ నెల తర్వాత అలా మాట్లాడిన సన్నాసులకు తాము చేసిన పనేంటో తెలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రాజెక్టుల మీద ఎన్ని కేసులు వేసినా, ఎన్ని రకాల చిల్లర రాజకీయాలు చేసిన తమ ప్రయత్నాలు ఆగలేదని, మరింత పురోగమిస్తూనే ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు.
(The above story first appeared on LatestLY on Dec 30, 2019 08:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

