Telangana Rains: హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన కుండపోత వాన, జలమయమైన భాగ్యనగరం; తెలంగాణ వ్యాప్తంగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు, మరో మూడు రోజుల పాటు భారీ వర్షసూచన

తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి, మరోవైపు ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో స‌ముద్ర మ‌ట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది...

Telangana Rains: హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన కుండపోత వాన, జలమయమైన భాగ్యనగరం; తెలంగాణ వ్యాప్తంగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు, మరో మూడు రోజుల పాటు భారీ వర్షసూచన
Heavy rains. (Photo Credits: PTI)

Hyderabad, September 3: హైదరాబాద్ లో గురువారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో నగరంలోని రోడ్లు, వీధులన్నీ జలమయమయ్యాయి. రాత్రి 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైన భారీ వర్షం సుమారు గంట, రెండు గంటల పాటు కొనసాగింది, కొన్ని చోట్ల ఎడతెరిపిలేకుండా కురిసింది. వర్షపు నీరు భారీగా వచ్చి చేరడంతో చాలా కాలనీల్లో వాహనాల బ్రేక్‌డౌన్‌కు దారితీసింది. నేక అపార్ట్‌మెంట్‌ల సెల్లార్‌లలోకి నీరు ప్రవేశించడంతో బైక్స్, కార్స్ మునిగిపోయాయి. బాలానగర్‌లో 68.8 మిమీ, జూబ్లీహిల్స్‌లో 66.8 మిమీ, యూసుఫ్‌గూడలో 64 మిమీ,  మరియు శ్రీనగర్ కాలనీలో 58.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. కూకట్‌పల్లి, శేరి లింగంపల్లి, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, మణికొండ, మూసాపేట్, మాదాపూర్, అమీర్‌పేట, కొంపల్లి, బోయినపల్లి, సోమాజిగూడ, మసాబ్ ట్యాంక్, బంజారాహిల్స్, అత్తాపూర్, హైదర్‌గూడ, రాజేంద్రనగర్, మీర్‌పేట్, LB నగర్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఆఫీసుల నుంచి తిరిగొచ్చేటపుడు భారీ వర్షం ప్రారంభమవడంతో ప్రజలు ఇళ్లకు చేరటానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు, పలు చోట్ల ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది, ప్రైవేట్ క్యాబ్ సర్వీసెస్ విపరీతంగా రేట్లు పెంచేశాయి.

ఐఎండీ బులెటిన్ ప్రకారం, నగరంలో మరో 3 రోజుల పాటు చినుకులు పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 3 నుండి 6 వరకు హైదరాబాద్‌లో తేలికపాటి వర్షం లేదా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని అంచనా వేయబడింది.

ఇక, తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి, మరోవైపు ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో స‌ముద్ర మ‌ట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ, శని మరియు ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనావేసింది. సెప్టెంబర్ 6 వరకు వర్షసూచన ఉన్నట్లు తెలిపింది, రాష్ట్రంలోని పలు ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనావేసింది.

(The above story first appeared on LatestLY on Sep 03, 2021 08:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).