Principal Rupa Reddy Murder Case: 27 కత్తిపోట్లు.. బాబు అనే పిలుపు.. రక్తపు మరకలున్న నగదు.. ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలను వెల్లడించిన పోలీసులు..

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసులో నిందితులు మరెవరో కాదు.. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులేనని పోలీసులు గుర్తించారు

Principal Rupa Reddy Murder Case: 27 కత్తిపోట్లు.. బాబు అనే పిలుపు.. రక్తపు మరకలున్న నగదు.. ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలను వెల్లడించిన పోలీసులు..
Principal Rupa Reddy Murder Case (Photo-Video Grab)

Principal Rupa Reddy Murder Case: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసులో నిందితులు మరెవరో కాదు.. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ విద్యార్థులేనని పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు బాధితురాలి చివరి ఫోన్ సంభాషణ కీలక ఆధారాలుగా మారినట్లు పోలీసులు తెలిపారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హత్య అనంతరం మొదట్లో పోలీసులకు పెద్దగా ఆధారాలు లభించలేదు. దీంతో దర్యాప్తు బృందాలు 50 మందికి పైగా అనుమానితులను విచారించాయి. ఈ క్రమంలో హత్యకు కొద్దిసేపటి ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్‌లో మాట్లాడిన విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లోకి వచ్చిన వ్యక్తులను ఆమె సాధారణంగా విద్యార్థులను పిలిచే విధంగా బాబు అని సంబోధించినట్లు ఆమె చిన్నమ్మ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. దీంతో హంతకులకు బాధితురాలితో పరిచయం ఉండే అవకాశం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు.

తాతపై మనవరాలు దారుణం.. ప్రియుడు చంపుతుంటే తాత హత్యను వీడియో కాల్‌లో చూసిన 13 ఏళ్ల బాలిక.. నిందితులంతా అరెస్ట్..

ఘటన జరిగిన ప్రాంతం చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ఎరుపు రంగు షర్ట్ ధరించిన ఓ మైనర్ బాలుడు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఆ క్లూ ఆధారంగా బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తన స్నేహితుడితో కలిసి హత్యకు పాల్పడినట్లు బాలుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఇద్దరు విద్యార్థులు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. వారికి జల్సాలకు అలవాటు పడటంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఫోన్లు ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. విద్యార్థుల ఫోన్ వినియోగం, ఆన్‌లైన్ కార్యకలాపాలపై రూపారెడ్డి గతంలో వారిని మందలించినట్లు పోలీసులు గుర్తించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించిన విషయం కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

దీంతో ప్రిన్సిపాల్‌పై కక్ష పెంచుకున్న విద్యార్థులు.. ఆమె వద్ద ఉన్న నగదును దోచుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం ముందుగానే ప్రణాళిక వేసుకుని, హత్య నుంచి తప్పించుకునే మార్గాలపై ఆన్‌లైన్‌లో సమాచారం వెతికినట్లు దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు.

హత్యకు ముందు ఇద్దరు విద్యార్థులు ప్రణాళిక ప్రకారం రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కొండమల్లేపల్లిలోనే కత్తి, గ్లౌజులు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. రూపారెడ్డి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒక విద్యార్థి బయట వాటర్ ట్యాంక్ సమీపంలో కాపలా ఉండగా.. మరో విద్యార్థి వెనుక వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు.

లోపలికి వెళ్లిన విద్యార్థి రూపారెడ్డిపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఇంట్లోని రూ.1.54 లక్షల నగదు, బాధితురాలి మొబైల్ ఫోన్ తీసుకుని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇద్దరు మైనర్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బాధితురాలి ఫోన్‌తో పాటు రక్తపు మరకలు ఉన్న రూ.1.54 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదువు చెప్పాల్సిన గురువు, పాఠశాల ప్రిన్సిపాల్‌పై అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే ఇంతటి దారుణానికి పాల్పడ్డారనే విషయం వెలుగులోకి రావడం కొండమల్లేపల్లిలో తీవ్ర కలకలం రేపింది.

ప్రస్తుతం ఇద్దరు మైనర్ నిందితులపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి. కేసులో మరిన్ని ఆధారాలను సేకరించడంతో పాటు హత్యకు సంబంధించిన పూర్తి పరిణామాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలో కనిపించిన ఓ అనుమానాస్పద కదలిక.. చివరి ఫోన్ సంభాషణలో వినిపించిన ‘బాబు’ అనే పిలుపు.. చివరకు రక్తపు మరకలున్న నగదు — ఈ మూడు కీలక ఆధారాలు ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీని ఛేదించడంలో కీలకంగా మారాయి.

(The above story first appeared on LatestLY on Aug 19, 2026 08:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).