Telangana Assembly Elections 2023: అల్లుడైనా.. కొడుకైనా సరే, కంటోన్మెంట్ నుండి పోటీకి సై అంటున్న సర్వే సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తుల గడువు నేటితో ముగింపు
చాలా రోజుల తర్వాత గాంధీ భవన్ కు వచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు.
Hyd, July 25: చాలా రోజుల తర్వాత గాంధీ భవన్ కు వచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత. ఢిల్లీ అధిష్టానం ఆదేశాల మేరకే తాను కంటోన్మెంట్ నుంచి దరఖాస్తు చేసుకున్నానని ఆయన (Congress leader Sarve Satyanarayana) చెప్పారు.
తన అల్లుడు క్రిశాంక్ కు బీఆర్ఎస్ కంటోన్మెంట్ టికెట్ ఇవ్వకపోవడం ఆ పార్టీ ఇష్టమన్నారు. ఒక వేళ ఎన్నికల నాటికి క్రిశాంక్ కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా.. తాను కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటానని చెప్పారు. తనపై కాంగ్రెస్ లో ఎలాంటి షోకాజ్ నోటీసులు కానీ, సస్పెన్స్ లు కానీ లేవన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని, ఆ తల్లికి ఈసారి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
పదేళ్ళు బీఆర్ఎస్కు అధికారం ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్కు అవకాశమివ్వాలన్నారు. తాను లోక్ సభకు పోటీ చేద్దామని భావించానని, కానీ ఢిల్లీ నుండి దరఖాస్తు చేయాలని తనకు ఫోన్ వచ్చిందన్నారు. అందుకే వచ్చి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేశారని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.
పనిచేయని రాసలీలల వైరల్ ఫోటో వ్యవహారం, బానోత్ మదన్ లాల్కే వైరా సీటు అప్పగించిన సీఎం కేసీఆర్
షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా చర్యలు ఉంటాయా? అని ప్రశ్నించారు. సోనియా తల్లివంటివారని, అలాంటి తల్లిని విడిచి ఎలా వెళ్తానన్నారు. తన అల్లుడు బీఆర్ఎస్ నుండి పోటీ చేసినా తాను మాత్రం కాంగ్రెస్ నుండి బరిలోకి దిగుతానని చెప్పారు. అవసరమైతే పార్టీ కోసం కొడుకుపై కూడా పోటీ చేస్తానన్నారు.కాగా, చాలా రోజుల తర్వాత గాంధీ భవన్కు రావడంపై ఆయన స్పందిస్తూ... తనను సస్పెండ్ చేసిన వాళ్లను తీసేసే వరకు గాంధీ భవన్కు రానని, గతంలో చెప్పానని, ఇప్పుడు వాళ్లు లేరు కాబట్టి తాను వచ్చానని స్పష్టతనిచ్చారు.
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఈరోజు చివరి రోజు కావడంతో చాలామంది ఆశావహులు గాంధీభవన్కు వచ్చారు. ఇప్పటి వరకు 800కు పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ స్థానాలలో కూడా దరఖాస్తు చేస్తున్నారు. 2004, 2009లో నిజామాబాద్ లోక్ సభ నుండి గెలిచిన మధుయాష్కీ ఈసారి ఎల్బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడి నుండి ఆయన దరఖాస్తు చేశారు. హుజూరాబాద్ నుండి బల్మూరి వెంకట్, కంటోన్మెంట్ నుండి సర్వే సత్యనారాయణ, మధిర నుండి మల్లు భట్టి విక్రమార్క దరఖాస్తు చేసుకున్నారు.
నాగార్జున సాగర్ టికెట్ కోసం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కొడుకులు రఘువీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి దరఖాస్తు చేశారు. మిర్యాలగూడ టికెట్ కోసం రఘువీర్ రెడ్డి అప్లికేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ సోదరుడు రంగారావు కుమార్తె రమ్యారావు, ఆమె కుమారుడు రితేశ్ రావు దరఖాస్తు పెట్టుకున్నారు. హైదరాబాద్లోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి అంజన్ కుమార్ యాదవ్, ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్ అప్లై చేశారు.
(The above story first appeared on LatestLY on Aug 25, 2023 05:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

