TSRTC Strike Update: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు, సమ్మెపై కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్-సర్కారుకు, ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ, సమ్మెపై వివరణ ఇవ్వాలంటూ కార్మిక సంఘాలకు నోటీసులు, తదుపరి విచారణ 10కి వాయిదా
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వివాదంపై హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. సమ్మెపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి.
Hyderabad, October 6: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వివాదంపై హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. సమ్మెపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద వాస్తవ పరిస్థితులను ఈనెల 10న తమకు నివేదించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి రాజశేఖర్రెడ్డి.. న్యాయవాదుల వాదనలు విన్నారు. సమ్మె చట్టబద్ధంకాదని ప్రభుత్వ తరఫున న్యాయవాది వాదించారు. కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధంగా హైకోర్టుకు తెలిపారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశామని వివరించారు. పండగ సమయంలో కార్మికులు ఇలా సమ్మె బాటపట్టడం సరికాదన్న న్యాయవాది వాదించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. గంటపాటు వాదనలు విన్న న్యాయమూర్తి రాజశేఖర్రెడ్డి.. సమ్మెపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యజమాన్యాన్ని ఆదేశించారు. అలాగే తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. హైకోర్టుకు ప్రస్తుతం సెలవులు కావడంతో కుందన్బాగ్లోని జడ్జి నివాసంలో పిటిషన్పై విచారణ జరిగింది.సమ్మెపై వివరణ ఇవ్వాల్సిందిగా రెండు ఆర్టీసీ ఉద్యోగుల గుర్తింపు సంఘాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎస్ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్రెడ్డి, రవాణా ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్ కుమార్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రవాణా, ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో అద్దె బస్సులను 50 శాతానికి పెంచడం, అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. సమ్మెను నివారించడానికి ప్రభుత్వం, కార్మిక సంఘాలతో చర్చలు జరిపింది. కానీ ఈ చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మెలోకి వెళ్లారు. దసరా పండుగ నేపథ్యంలో సమ్మె చేపట్టడడంపై సర్కార్ సీరియస్గా ఉంది. విధుల్లోకి హాజరు కావాలని, లేనిపక్షంలో వారిని ఉద్యోగులుగా పరిగణించమన్న హెచ్చరికలను కూడా కార్మికులు బేఖాతర్ చేశారు . దీంతో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ యోచిస్తోందని తెలుస్తోంది. దసరా పండుగ కోసం స్వస్థలాలకు వెళ్తున్న వారికి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంతో ప్రయాణికులకు కొంచెం ఊరట లభించింది. తాత్కాలిక పద్ధతిన నియమించిన డ్రైవర్లు, కండక్టర్లతో అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు కొంతమేర రోడ్డెక్కాయి.
(The above story first appeared on LatestLY on Oct 06, 2019 08:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

