Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయం కోసం బడ్జెట్‌లో రూ. 610 కేటాయింపు, నిర్మాణ పనులను వేగవంతం చేసిన ప్రభుత్వం, నేరుగా వెళ్లి పనుల పురోగతిని సమీక్షించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా, తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయాన్ని మనం నిర్మించుకోవాలి. దేశం గర్వించే విధంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మన సచివాలయం నిలవాలి. ఉద్యోగులకు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా వాతావరణాన్ని నెలకొల్పాలి. విశాలమైన...

Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయం కోసం బడ్జెట్‌లో రూ. 610 కేటాయింపు, నిర్మాణ పనులను వేగవంతం చేసిన ప్రభుత్వం, నేరుగా వెళ్లి పనుల పురోగతిని సమీక్షించిన సీఎం కేసీఆర్
CM KCR review on secretariat building complex | Photo: CMO

Hyderabad, March 19: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణం కోసం 2021-22 బడ్జెట్ లో రూ. 610 కోట్లను కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే.  ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా సచివాలయ నిర్మాణానికి క్లీన్ చిట్ ఇవ్వడంతో  నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది.  నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ నేరుగా వెళ్లి సమీక్షించారు.  రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులు మరియు వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు నిర్మాణ పనులను వివరించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ సచివాలయ నిర్మాణ కౌశలం దేశానికే వన్నెతెచ్చే విధంగా, అలంకృత రూపంతో అద్భుతంగా ఉండాలని, పదికాలాల పాటు నిలిచి ఉండే తెలంగాణ సెక్రటేరియట్‌ను పటిష్టమైన రీతిలో నిర్మించాలని అన్నారు. సచివాలయ నైరుతి దిక్కు ప్రాంతాన్ని సీఎం కాలినడకన కలియతిరిగుతూ, నిర్మాణంలో ఉన్న పిల్లర్లను, బీమ్‌ల నాణ్యతను పరిశీలించారు. నిర్మాణాల్లో చేపట్టవలసిన చర్యలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. అలాగే సచివాలయ నిర్మాణంలో సుందరీకరణ కోసం రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ సాండ్ స్టోన్, బీజ్ స్టాండ్ స్టోన్, నేచురల్ బీజ్, నేచురల్ గ్వాలియర్ స్టోన్స్ నమూనాలను పరిశీలించారు.

అనంతరం ప్రగతి భవన్ వెళ్లిన సీఎం, సెక్రటేరియట్ నిర్మాణంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘‘సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం, అనతికాలంలోనే అభివృద్ది సంక్షేమ రంగాల్లో దేశానికే మార్గదర్శిగా పాలన సాగుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవం మరింత ఇనుమడించేలా, తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయాన్ని మనం నిర్మించుకోవాలి. దేశం గర్వించే విధంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మన సచివాలయం నిలవాలి. ఉద్యోగులకు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా వాతావరణాన్ని నెలకొల్పాలి. విశాలమైన అంతర్గత రోడ్లు, పలురకాల పూల మొక్కలతో విశాలమైన పచ్చిక బయళ్లను ఏర్పాటు చేసుకోవాలి. దిల్లీలోని పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉన్నట్లుగా 'ధోల్ పూర్ స్టోన్'‌తో తీర్చిదిద్దిన ఫౌంటేన్లను నిర్మించుకోవాలి. అన్ని హంగులతో తెలంగాణ సచివాలయాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి’’ అని సీఎం అన్నారు.

ఈ సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, సచివాలయ వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

(The above story first appeared on LatestLY on Mar 19, 2021 12:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).