Airtel 5G Netowrk: జియోకి భారీ షాక్, 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఎయిర్‌టెల్, ఒకే స్పెక్ట్రమ్ బ్లాక్‌లో ఏకకాలంలోనే 5జీ, 4జీ సేవలు

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ కు మరో దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ భారీ షాక్ ఇచ్చింది. జియో కంటే ముందుగానే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించించింది. ఈ ప్రయోగంతో 5జీ సర్వీసుల ఆవిష్కరణకు తాము కూడా సిద్దంగా ఉన్నామనే సంకేతాలను తన ప్రత్యర్థికి పంపింది.

Airtel 5G Netowrk: జియోకి భారీ షాక్, 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఎయిర్‌టెల్, ఒకే స్పెక్ట్రమ్ బ్లాక్‌లో ఏకకాలంలోనే 5జీ, 4జీ సేవలు
Bharti Airtel. (Photo Credits: Twitter)

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ కు మరో దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ భారీ షాక్ ఇచ్చింది. జియో కంటే ముందుగానే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షించించింది. ఈ ప్రయోగంతో 5జీ సర్వీసుల ఆవిష్కరణకు తాము కూడా సిద్దంగా ఉన్నామనే సంకేతాలను తన ప్రత్యర్థికి పంపింది. గతంలో 5జీ సేవల కోసం (Airtel 5G Netowrk) కొంత సమయం కావాలని కోరిన ఎయిర్‌టెల్, ఒక్కసారే 5జీ సేవలను ఒక ప్రైవేట్ నెట్‌వర్క్‌ ద్వారా ప్రయోగాత్మకంగా పరీక్షించే సరికి జియో (Jio) కూడా విస్మయానికి గురి అయ్యింది.

కాగా న్యూఢిల్లీకి చెందిన ఒక టెల్కో కంపెనీ నాన్-స్టాండలోన్ (ఎన్‌ఎస్‌ఏ) నెట్‌వర్క్ టెక్నాలజీ ద్వారా 1800మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ లో 5జీ సేవలను పరీక్షించినట్లు ఎయిర్‌టెల్ (Bharti Airtel) పేర్కొంది. ఒకే స్పెక్ట్రమ్ బ్లాక్‌లో ఏకకాలంలోనే 5జీ, 4జీ సేవలు (Bharti Airtel tests 5G service) అందించవచ్చని పేర్కొంది. ప్రస్తుత నెట్‌వర్క్ టెక్నాలజీ కంటే 5జీ నెట్‌వర్క్ వేగం 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది. 5జీ ఫోన్‌లో ఫుల్ మూవీని కొన్ని సెకన్లలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని పేర్కొంది.

అయితే ఎయిర్‌టెల్ కొత్త 5జీ సేవలు అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ నుంచి పూర్తి అనుమతులు, సరిపడినంత స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాతనే ఎయిర్‌టెల్ 5జీ సేవలు యూజర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త 5జీ సేవల కోసం వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఎయిర్‌టెల్ పేర్కొంది.

వాట్సాప్‌లోకి కొత్త ఫీచర్, ఇకపై వేలిముద్ర లేదా ఫేస్ ఐడిని ఉపయోగించి లాగిన్ కావచ్చు, ఫేస్‌బుక్ ఆటోమేటిక్ లాగౌట్

విజయవంతంగా 5జీ సేవలను పరీక్షించినందుకు ఇంజినీర్లను కంపెనీ అభినందించింది. 5జీ పరీక్షల కోసం ఎయిర్‌టెల్ ఒప్పో రెనో 5ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2ప్రో స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించింది. ఎయిర్‌టెల్ ప్రత్యర్థి, భారతదేశపు అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్ జియో 2021 రెండవ భాగంలో దేశంలో తన 5జి సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

ఇదిలా ఉంటే 2020 నవంబర్ నెలలో కొత్త యూజర్లను ఆకర్షించడంలో ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియోపై భారతీ ఎయిర్‌టెల్ పైచేయి సాధించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విడుదల చేసిన నివేదిక ప్రకారం, కొత్తగా 43 లక్షల మందిని తన నెట్‌వర్క్‌ పరిధిలో చందాదారులగా చేర్చుకుంది. దింతో వరుసగా నాలుగు నెలలు పాటు అన్ని టెలికాం కంపెనీల కంటే ఎక్కువగా యూజర్లను ఎయిర్‌టెల్ ఆకర్షించినట్లు ట్రాయ్ తన నివేదికలో పేర్కొంది. రెండో స్థానంలో మరో ప్రముఖ సంస్థ రిలయన్స్ జియో నిలిచింది.

కాగా ఇప్పటికి మొత్తం ఖాతాదారుల సంఖ్యలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. ట్రాయ్ డేటా ప్రకారం, నవంబర్ లో 4.37 మిలియన్ల కొత్త యూజర్లను చేర్చుకున్న తర్వాత భారతి ఎయిర్టెల్ మొత్తం చందాదారుల సంఖ్య 33.4 కోట్లకు చేరుకున్నారు. అదే నెలలో 1.93 మిలియన్ల కొత్త వినియోగదారులను చేర్చుకున్న తర్వాత రిలయన్స్ జియో మొత్తం చందాదారుల సంఖ్య 40.8 కోట్లకు చేరుకుంది.

ఇదిలా ఉంటే వోడాఫోన్ ఐడియా (వీఐ), బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం తమ ఖాతాదారులను కోల్పోయాయి. వొడాఫోన్ ఐడియా 28.9 కోట్ల మందితో మూడోస్థానంలో, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ 11.8 కోట్ల మంది చందాదారులతో తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఇతర కంపెనీల యాక్టీవ్ యూజర్లతో పోలిస్తే మాత్రం వోడాఫోన్ ఐడియా 96.63శాతం యాక్టీవ్ యూజర్లతో పైచేయి సాధించింది. తర్వాత స్థానంలో ఎయిర్‌టెల్ 89.01శాతం, రిలయన్స్ జియో 79.55శాతం యాక్టీవ్ యూజర్లను కలిగి ఉంది.

అయితే, నవంబర్ నెలలోనూ వొడాఫోన్‌ భారీగా చందాదారులను కోల్పోయింది. ఆ ఒక్క నెలలోనే 28.9 లక్షల మంది ఖాతాదారులు వొడాఫోన్ ఐడియాను వీడారు. నవంబర్ నెలలో కొత్తగా చేరిన ఖాతాదారులతో మొత్తం టెలిఫోన్ యూజర్ల సంఖ్య 1,171.80 మిలియన్ల నుంచి 1,175.27 మిలియన్లకు పెరిగిందని ట్రాయ్ తెలిపింది.

(The above story first appeared on LatestLY on Feb 02, 2021 04:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).