Ashiss Kumar Dash (photo-Infosys web)

Ashiss Kumar Dash: భారతదేశపు రెండో అతిపెద్ద ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. సంస్థ తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా ఆశిష్ కుమార్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో సలీల్ పరేఖ్ పదవీకాలం ముగిసిన అనంతరం.. 2027 ఏప్రిల్ 1 నుంచి ఆశిష్ కుమార్ దాస్ పూర్తిస్థాయిలో సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారు.

గురువారం నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. నియామక ప్రక్రియలో భాగంగా ఆయన తక్షణమే సీఈవో డెజిగ్నేట్ గా బాధ్యతలు స్వీకరించి.. అధికార మార్పిడికి సంబంధించి సలీల్ పరేఖ్‌తో కలిసి పనిచేస్తారు. ఈ నియామకానికి కంపెనీ వాటాదారులు, సంబంధిత చట్టపరమైన నియంత్రణ సంస్థల ఆమోదం పొందాల్సి ఉంది.

ఉపాధి అవకాశాల్లో దూసుకుపోతున్న విశాఖపట్నం.. లింక్డ్‌ఇన్ జాబితాలో అగ్రస్థానం.. టాప్ టెన్ నాన్-మెట్రో నగరాలు ఇవే..

ఇన్ఫోసిస్‌లో దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆశిష్ కుమార్ దాస్.. ఇటీవల సంస్థ చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక మార్పులలో అత్యంత కీలక పాత్ర పోషించారు. సంస్థ ఆశయాలను, విలువలను కాపాడుతూనే, ప్రస్తుత సాంకేతిక యుగానికి అనుగుణంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకోగల సమర్థుడైన నాయకుడు ఆశిష్ అని ఇన్ఫోసిస్ బోర్డు ఛైర్మన్ నందన్ నీలేకని కొనియాడారు. బోర్డు తనపై ఉంచిన నమ్మకానికి ఆశిష్ దాస్ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుత సీఈవో సలీల్ పరేఖ్ కూడా ఈ నాయకత్వ మార్పును స్వాగతిస్తూ, అధికార మార్పిడి ప్రక్రియ అత్యంత సజావుగా పూర్తివుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఇదే బోర్డు సమావేశంలో నూతనంగా చేరిన అర్హులైన ఉద్యోగులకు 9,836 రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లను (RSU), ఇతర సిబ్బందికి దాదాపు 4.78 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.