Is Human Intelligence Declining? ఒకప్పుడు మెరుగైన విద్య, నాణ్యమైన వైద్య సేవలు, పౌష్టికాహారం, మెరుగైన జీవన ప్రమాణాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల మానసిక సామర్థ్యం (IQ) క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ ధోరణిని శాస్త్రవేత్తలు ఫ్లిన్ ఎఫెక్ట్ గా పేర్కొన్నారు. ముఖ్యంగా 20వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి తరం ముందు తరంతో పోలిస్తే ఎక్కువ మేధో సామర్థ్యాన్ని కనబరిచింది. దీంతో మానవ మేధస్సు నిరంతరం అభివృద్ధి చెందుతోందనే అభిప్రాయం బలపడింది.
అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఈ ధోరణి పూర్తిగా మారిపోయింది. యూరప్, ఉత్తర అమెరికాలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల సగటు ఐక్యూ స్కోర్లు పెరగడం ఆగిపోవడమే కాకుండా క్రమంగా తగ్గుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కొత్త ధోరణిని రివర్స్ ఫ్లిన్ ఎఫెక్ట్ గా శాస్త్రవేత్తలు వ్యవహరిస్తున్నారు. ఆధునిక సాంకేతికత, డిజిటల్ జీవనశైలి, మారుతున్న అలవాట్లు మన ఆలోచనా శక్తిని దెబ్బతీస్తున్నాయా అనే చర్చకు ఈ పరిణామం తెరలేపింది.
ఈ అంశంపై నార్వేలో నిర్వహించిన దీర్ఘకాలిక పరిశోధనలో సుమారు ఏడు లక్షలకు పైగా పురుషుల మానసిక సామర్థ్యాలను విశ్లేషించారు. పరిశోధనలో 1970ల తర్వాత జన్మించిన తరాల్లో ఐక్యూ స్కోర్లు ప్రతి ఏడాది స్వల్పంగా తగ్గుతున్నట్లు గుర్తించారు. ఇదే ధోరణి డెన్మార్క్, ఫ్రాన్స్, బ్రిటన్, ఫిన్లాండ్ వంటి దేశాల్లో కూడా నమోదైంది. దీంతో ఇది ఒకే దేశానికి పరిమితమైన సమస్య కాదని, అభివృద్ధి చెందిన సమాజాల్లో కనిపిస్తున్న విస్తృత మార్పని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ తగ్గుదలకు జన్యుపరమైన కారణాలు లేవని పరిశోధకులు స్పష్టం చేశారు. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన, ఒకే జన్యు లక్షణాలు కలిగిన అన్నదమ్ముల మధ్య కూడా పెద్దవారితో పోలిస్తే చిన్నవారి ఐక్యూ తక్కువగా ఉండటం గమనించారు. దీని ఆధారంగా ఈ మార్పు వారసత్వం వల్ల కాదని, పర్యావరణం, జీవనశైలి, సామాజిక మార్పుల ప్రభావమే ప్రధాన కారణమని నిర్ధారించారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, సెర్చ్ ఇంజిన్లపై పెరుగుతున్న ఆధారపడటం మెదడుపై ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు చిన్న సమాచారాన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా వెంటనే ఫోన్లో వెతికేయడం అలవాటైంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, స్వతంత్ర ఆలోచన, సమస్యలను విశ్లేషించే సామర్థ్యం క్రమంగా తగ్గుతున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అదే సమయంలో సోషల్ మీడియా నోటిఫికేషన్లు, నిరంతరం స్క్రోల్ చేసే అలవాటు, కొన్ని సెకన్ల నిడివి ఉన్న వీడియోల వినియోగం వల్ల ఏకాగ్రత తగ్గిపోవడం, ఒకే అంశంపై ఎక్కువసేపు దృష్టి నిలపలేకపోవడం, మెదడు పనితీరులో కీలకమైన వర్కింగ్ మెమరీ బలహీనపడటం వంటి సమస్యలు పెరుగుతున్నాయి.
మరో కీలక కారణం పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోవడంగా చెప్పుకోవచ్చు. గతంలో పుస్తకాలు, వ్యాసాలు, పరిశోధనలను లోతుగా చదివి అర్థం చేసుకునే సంస్కృతి ఉండేది. కానీ ప్రస్తుతం చాలా మంది కేవలం ముఖ్యాంశాలను మాత్రమే స్కాన్ చేయడం, చిన్న చిన్న పోస్టులు చదవడం, వీడియోల ద్వారా సమాచారం తెలుసుకోవడానికే పరిమితమవుతున్నారు. దీంతో భాషా నైపుణ్యం, విశ్లేషణాత్మక ఆలోచన, తార్కికత దెబ్బతింటున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా విద్యా వ్యవస్థల్లో వేగవంతమైన సమాధానాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, శారీరక శ్రమ తగ్గిపోవడం, నిద్రలేమి, అధిక మానసిక ఒత్తిడి వంటి అంశాలు కూడా మానసిక సామర్థ్యాల క్షీణతకు దోహదం చేస్తున్నాయి.
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ పరిస్థితి శాశ్వతం కాదు. ఎందుకంటే ఇది జన్యుపరమైన సమస్య కాదు.. జీవనశైలికి సంబంధించిన మార్పుల ఫలితం మాత్రమే. అందువల్ల కొన్ని అలవాట్లను మార్చుకుంటే మెదడు పనితీరును మెరుగుపరచుకోవచ్చు.
ప్రతిరోజూ పుస్తక పఠనానికి సమయం కేటాయించాలి.
స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేస్తూ డిజిటల్ డిటాక్స్ పాటించాలి.
సమస్యలను స్వయంగా ఆలోచించి పరిష్కరించే అలవాటు పెంచుకోవాలి.
తగినంత నిద్ర, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
ఏకాగ్రత పెంచే ధ్యానం, మెదడుకు వ్యాయామం చేసే పజిల్స్, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం వంటి అలవాట్లు పెంపొందించుకోవాలి.
ఏదేమైనా రివర్స్ ఫ్లిన్ ఎఫెక్ట్ మానవ మేధస్సు శాశ్వతంగా తగ్గిపోతోందని కాదు. ఆధునిక జీవనశైలిలో ఏర్పడిన మార్పుల ప్రభావాన్ని ఇది సూచిస్తోంది. టెక్నాలజీని అవసరమైనంత మేరకే వినియోగిస్తూ, పుస్తక పఠనం, లోతైన ఆలోచన, ఏకాగ్రతకు ప్రాధాన్యం ఇస్తే మానసిక సామర్థ్యాలను తిరిగి మెరుగుపరచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.