GNSS: ప్రైవేటు వాహనదారులకు గుడ్న్యూస్, హైవేపై రోజుకు 20 కిలోమీటర్ల దూరం ఎలాంటి ఛార్జీలు ఉండవు, టోల్ ట్యాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు చేసిన కేంద్రం
ప్రైవేటు వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. వాహనానికి జీఎన్ఎస్ఎస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) సౌలభ్యం కలిగిన వాహనదారులు హైవేలు, ఎక్స్ప్రెస్ రహదారులపై రోజుకు 20 కిలోమీటర్ల దూరం ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే ప్రయాణించవచ్చని ప్రకటించింది.
New Delhi,Sep 10: ప్రైవేటు వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. వాహనానికి జీఎన్ఎస్ఎస్ (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) సౌలభ్యం కలిగిన వాహనదారులు హైవేలు, ఎక్స్ప్రెస్ రహదారులపై రోజుకు 20 కిలోమీటర్ల దూరం ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే ప్రయాణించవచ్చని ప్రకటించింది.ఈ నిర్ణయంతో శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు (Toll collection) దిశగా మరో ముందడుగు పడింది.ఎప్పటి నుంచో ఈ విధానాన్ని తీసుకొస్తామని ప్రకటిస్తూ వస్తున్న కేంద్ర రవాణా శాఖ.. తాజాగా దీన్ని నోటిఫై చేసింది.
ప్రస్తుతం అనుసరిస్తున్న ఫాస్టాగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీకి అదనంగా ఈ కొత్త విధానం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) ఆధారిత టోల్ విధానం అమలు కానుంది. నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్తో కూడిన ఆన్ బోర్డు యూనిట్ (OBU) కలిగిన వాహనాలు టోల్ ప్లాజా మీదుగా వెళ్లినప్పుడు.. ప్రయాణించిన దూరానికి గానూ టోల్ ఫీజు ఆటోమేటిక్గా చెల్లింపు జరిగిపోతుంది. ఈ తరహా వాహనాలకు ప్రత్యేక లేన్లను అమర్చనున్నారు.
నావిగేషన్ డివైజ్ లేని వాహనాలకు సాధారణ టోల్ ఛార్జీలే వర్తిస్తాయి. అలాగే, కొత్తగా 20 కిలోమీటర్ల వరకు జీరో టోల్ కారిడార్ను తీసుకొచ్చారు. అంటే జాతీయ రహదారిపై 20 కిలోమీటర్ల వరకు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆపై ప్రయాణిస్తే దూరానికి తగ్గట్లు టోల్ చెల్లించాల్సి ఉంటుంది.ప్రైవేటు వాహనదారులకు ప్రయోజనం కల్పిస్తూ ఈ మేరకు జాతీయ రహదారుల ఫీజుల నిబంధనలు-2008ను సవరించినట్టు వెల్లడించింది. ఆ మేరకు జీఎన్ఎస్ఎస్ సౌలభ్యం ఉన్న వాహనదారులకు ప్రయోజనం చేకూర్చేలా జాతీయ రహదారుల ఫీజు నిబంధనలు-2024ను కొత్తగా అప్డేట్ చేశామని వివరించింది.
నేషనల్ పర్మిట్ ఉన్న వాహనాలు మినహా ఇతర వెహికల్స్ ఒక రోజులో జాతీయ రహదారులు, బైపాస్ లేదా సొరంగం గుండా ప్రయాణిస్తే వాహన డ్రైవర్ లేదా యజమాని ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదని... అన్ని దిశల్లో 20 కిలోమీటర్ల ప్రయాణ దూరం మినహాయింపుగా ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. ఒకప్పుడు మాన్యువల్గా చెల్లించే విధానం ఉండగా.. కొన్నేళ్ల క్రితం ఫాస్టాగ్ను తీసుకొచ్చారు. దీంతో కొన్ని సెకన్ల పాటు వాహనం ఆపి తర్వాత ముందుకెళ్లాల్సి ఉంటుంది. పైగా కిలోమీటర్లతో సంబంధం లేకుండా టోల్ చెల్లించాల్సిందే. కొత్త విధానంలో వాహనంలో ఉండే డివైజ్ ఎంత దూరం ప్రయాణించిందీ లెక్కగడుతుంది. దీంతో ప్రయాణించిన దూరానికే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. పైగా టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు. తొలుత ప్రధాన జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై ఈ విధానాన్ని అమలు చేసి... తర్వాత దేశవ్యాప్తంగా తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
(The above story first appeared on LatestLY on Sep 10, 2024 08:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

