మన దేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రూ.2 వేలకు మించిన విలువైన యూపీఐ (UPI) లావాదేవీలపై సర్వీస్ ఛార్జీలు (ఎండీఆర్ - MDR) విధించేందుకు వీలు కల్పిస్తూ పార్లమెంటులో ఒక సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007'కు ఈ సవరణను ప్రతిపాదించారు.
అయితే ఈ నిర్ణయంతో సామాన్య వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యక్తుల మధ్య జరిగే నగదు బదిలీలు (P2P), చిన్న వ్యాపారులకు చేసే రోజువారీ చెల్లింపులపై ఎలాంటి రుసుములు ఉండవు. ఏడాదికి రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన పెద్ద వ్యాపార సంస్థలకు అందే రూ.2,000కు మించిన చెల్లింపులపై మాత్రమే 0.3 శాతం నుండి 0.5 శాతం వరకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తిస్తుంది. ఈ ఛార్జీలను వ్యాపారులే భరించాల్సి ఉంటుంది.
యాప్ స్టోర్ నుండి టెలిగ్రామ్ తాత్కాలిక తొలగింపు.. ఆపిల్ నిర్ణయం వెనుక ఉగ్రవాద అభియోగాల కలకలం..
2020 జనవరిలో కేంద్రం అమలులోకి తెచ్చిన 'జీరో ఎండీఆర్' (Zero MDR) విధానం వల్ల బ్యాంకులు, ఫోన్పే, గూగుల్పే వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదాయం నిలిచిపోయింది. దీంతో నెట్వర్క్ నిర్వహణ, సైబర్ భద్రత, సాంకేతిక పురోగతికి పెట్టుబడులు పెట్టడం భారం కావడంతో ప్రభుత్వం ఈ పునఃసమీక్షకు శ్రీకారం చుట్టింది.
ప్రస్తుతం దేశంలో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీల సంఖ్య 4-5 శాతమే ఉన్నప్పటికీ.. మొత్తం లావాదేవీల విలువలో అది ఏకంగా 65 శాతం వరకు ఉంది. బడా వ్యాపారులపై ఈ నామమాత్రపు రుసుము విధిస్తే ఏటా రూ.5 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరి, డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతులు మరింత బలోపేతమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.