Free UAE Visa for Indians: భారతీయ టూరిస్టులను ఆకట్టుకునేందుకు అబుదాబి సాంస్కృతిక, పర్యాటక శాఖ (DCT అబుదాబి) ఒక సరికొత్త పర్యాటక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద భారతదేశం నుండి ప్రయాణించే భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు కనీసం మూడు రాత్రుల అబుదాబి విహారయాత్రను బుక్ చేసుకుంటే.. వారి యూఏఈ (UAE) ప్రవేశ వీసా పూర్తి ఉచితంగా లభిస్తుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం 2026 ఆగస్టు 1 నుండి అక్టోబర్ 31 వరకు మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. మొదటి విడతగా ప్రయోగాత్మకంగా 20 వేల ఉచిత వీసాలను అందించాలని డీసీటీ అబుదాబి లక్ష్యంగా పెట్టుకుంది.
ఉచిత వీసా పొందేందుకు అర్హతలు: ఈ ఉచిత వీసా సదుపాయం భారతదేశం నుండి బయలుదేరే భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రయాణికులు కింద పేర్కొన్న నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
స్టే వ్యవధి: అబుదాబిలోని ఏదైనా హోటల్లో వరుసగా కనీసం మూడు రాత్రులు బసను బుక్ చేసుకోవాలి.
రిటర్న్ టికెట్: భారతదేశం నుండి అబుదాబికి వెళ్ళి, తిరిగి రావడానికి (రౌండ్ ట్రిప్) విమాన టికెట్ కలిగి ఉండాలి.
బుకింగ్ విధానం: డీసీటీ అబుదాబి భాగస్వామ్య ట్రావెల్ ఏజెన్సీలు లేదా ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫారమ్ల ద్వారా మాత్రమే ఈ హాలిడే ప్యాకేజీ బుకింగ్ చేసుకోవాలి.
అర్హత కలిగిన ప్రయాణికుల వీసా మొత్తం ఖర్చును (ఒక్కో వీసాకు 285 యూఏఈ దిర్హమ్లు - Dh285) డీసీటీ అబుదాబి శాఖ నేరుగా భరిస్తుంది లేదా సంబంధిత ట్రావెల్ ఏజెన్సీలకు క్లెయిమ్ కింద రీయింబర్స్ చేస్తుంది.
కీలకమైన భారత మార్కెట్ పై దృష్టి: అబుదాబి పర్యాటక రంగానికి భారతదేశం.. అత్యంత కీలకమైన అంతర్జాతీయ మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. ఇరు దేశాల మధ్య విమాన అనుసంధానం (Connectivity) పెరగడం, పర్యాటకాన్ని మరింత చవకగా మార్చడం ద్వారా ఎక్కువ మంది భారతీయ సందర్శకులను ఆకర్షించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం.
ఈ సందర్భంగా డీసీటీ అబుదాబి అంతర్జాతీయ కార్యకలాపాల డైరెక్టర్ అబ్దుల్లా యూసుఫ్ మాట్లాడుతూ.. భారతీయ ప్రయాణికులకు అబుదాబిని మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ప్రవేశ వీసా ఖర్చును ఉచితం చేయడం ద్వారా భారతీయ కుటుంబాలు, ప్రయాణికులు అబుదాబికి రావడాన్ని సులభతరం చేస్తున్నాము.
ఇక్కడి సంస్కృతి, వినోదం, ఆతిథ్యం, సహజ సిద్ధమైన ఆకర్షణలను ఆస్వాదించేందుకు ఎక్కువ మంది భారతీయ పర్యాటకులకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ ఉచిత వీసా పథకం అమలుతో రాబోయే పండుగల సీజన్లో భారత్ నుంచి అబుదాబికి వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ట్రావెల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.