Varma Questions NEET: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పరీక్ష వివాదం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో.. ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ విద్యా వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అసలు సమస్య నీట్ పరీక్షలో లేదని.. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రూపంలో రాబోతున్న సవాలే ప్రధానమైనదని ఆయన స్పష్టం చేశారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుత సాంప్రదాయ విద్యా విధానాన్ని పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఉందని వర్మ సంచలన పిలుపునిచ్చారు. సమాచారాన్ని బట్టీ పట్టి, పరీక్షలు రాసి, డిగ్రీలు సాధించడం ద్వారా ఉద్యోగాలు పొందే పాత పద్ధతికి కాలం చెల్లిందని.. ఆ విధానాన్ని తక్షణమే పక్కన పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విషయమై వైద్య విద్యను ఉదాహరణగా చూపిస్తూ ఆయన వివరణ ఇచ్చారు. ఒక మెడికల్ విద్యార్థి ఎంబీబీఎస్, పీజీ, స్పెషలైజేషన్ పూర్తి చేయడానికి దాదాపు 10 సంవత్సరాల విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నాడని, కానీ అంతటి సమాచారాన్ని ఒక చిన్న మొబైల్లోని ఏఐ సాంకేతికత కేవలం క్షణాల్లో అందిస్తోందని తెలిపారు.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు సాంకేతికత ద్వారా, క్లిష్టమైన శస్త్రచికిత్సలు రోబోల ద్వారా అత్యంత వేగంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఇంకా నీట్ లాంటి పరీక్షల కోసం సంవత్సరాల తరబడి శ్రమించడం సమయాన్ని వృథా చేసుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే ఒకటి రెండేళ్లలోనే వైద్య రంగంలో ఏఐ పూర్తిస్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తుందని నిపుణులు కూడా చెప్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
సమాజంలో వేగంగా వస్తున్న సాంకేతిక మార్పులను గమనించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పూర్తిగా విఫలమవుతున్నారని వర్మ విమర్శించారు. నేటి తరంపై ఇంకా పాత విధానాలనే రుద్దుతున్నారని.. దీనివల్ల ప్రస్తుత విద్యా వ్యవస్థ తన మనుగడనే కోల్పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తు పూర్తిగా నాశనం కాకముందే సాంప్రదాయ విద్యా విధానానికి ముగింపు పలకాలని.. విద్యార్థులను ప్రాక్టికల్గా ఏఐ సాంకేతికతను ఉపయోగించుకునే దిశగా ప్రోత్సహించడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.