CM Chandrababu on Social Media Posts: మీ కొవ్వును కరిగిస్తాం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారికి సీఎం చంద్రబాబు వార్నింగ్, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి
అమరావతి రాజధాని పరిధిలోని తాళ్లాయపాలెంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ (జీఐఎస్)ను ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా పోస్టులపై మండిపడ్డారు.
Vjy, Nov 7: అమరావతి రాజధాని పరిధిలోని తాళ్లాయపాలెంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ (జీఐఎస్)ను ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా పోస్టులపై మండిపడ్డారు. ఆడబిడ్డలను కించపరిచేలా సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దీనికోసం అవసరమైన చట్టాలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
పాత ప్రభుత్వం దుర్మార్గంతో విద్యుత్ ఛార్జీలు కొంతవరకు పెంచాల్సి వచ్చిందన్నారు. అది తాను తీసుకొచ్చింది కాదని చెప్పారు. ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత తనదని స్పష్టం చేశారు. చరిత్రలో గుర్తుండిపోయేలా అమరావతి ఉద్యమం చేశారని చంద్రబాబు కొనియాడారు. ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు.
అధికారం పోయాక వైసీపీ నేతలు అభివృద్ధికి ఆటంకం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. మానసికంగా దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి అనిత, ఎమ్మెల్యేలపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ బిడ్డలపైనా ఇష్టారీతిన పోస్టులు పెట్టారని.. అలాంటి వారిని వదిలిపెట్టాలా? అని ప్రశ్నించారు. బాంబులకు కూడా భయపడలేదని.. కానీ తన గురించి అసెంబ్లీలో దుర్మార్గంగా మాట్లాడినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. కొవ్వు ఎక్కువై నేరస్థులుగా తయారవుతున్నారని తీవ్ర స్వరంతో సీఎం వ్యాఖ్యానించారు. ఆ కొవ్వును కరిగిస్తామన్నారు.
నేరస్థులు రాజకీయ ముసుగులో ఉన్నారు.. ఘోరాలు చేస్తున్నారు. ఆస్తులు కొట్టేస్తున్నారు. అదే సమయంలో ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యం అంటున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని సాక్షిలో ప్రసారం చేశారు. నేనూ నమ్మాను. ఆ తర్వాత అది భయంకరమైన హత్య అని తేలింది. కరుడుగట్టిన నేరస్థుడు ఎలాంటి పనులు చేస్తాడో గుర్తుపెట్టుకోవాలి. దేశం, ప్రపంచంలో ఉండే చట్టాలన్నీ అధ్యయనం చేస్తా.
ఆడబిడ్డలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే ఖబడ్దార్. హద్దులు దాటితే ఉపేక్షించేది లేదు. చేతగానితనం అనుకోవద్దు. మీరు మనుషులేనా? మీకూ, మృగాలకు తేడా ఏంటి?భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేయడమా? అసభ్య, అశ్లీల పోస్టులు పెట్టడమా? ఏ చట్టం మీకు ఈ హక్కు ఇచ్చింది? దీనిపై సీరియస్గా ఆలోచిస్తున్నా. పకడ్బందీగా చట్టం తీసుకొస్తాం. నేరస్థుల కట్టడి చేసేందుకు పోలీసులను సమర్థంగా తీర్చిదిద్దుతాం’’ అని చంద్రబాబు అన్నారు.
విద్యుత్ అంశంపై కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. విద్యుత్ వినియోదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.‘‘1998లో తొలితరం విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. 2004 నాటికి అన్ని సబ్స్టేషన్లు ఆధునీకరించాం. ట్రాన్స్మిషన్ నష్టాలు తగ్గించి తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. 2014లో నేను సీఎం అయ్యాక సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించాం. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ను ప్రోత్సహించాం. ఆధునిక సాంకేతికతతో గ్యాస్ ఆధారిత విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించుకోవడం గర్వకారణం. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా శంకుస్థాపన చేసిన 12 సబ్స్టేషన్లు, 10 ట్రాన్స్ మిషన్ లైన్ల పనులు ఏడాదిలోపు పూర్తవుతాయి.
రూ.1.25లక్షల కోట్ల అప్పు విద్యుత్ రంగంలోనే ఉండటం ఆశ్చర్యం కలిగించింది. రాష్ట్రంలో 2019 తర్వాత విద్యుత్ విధ్వంసం జరిగింది. గత ప్రభుత్వం కేంద్రం నిధులు సహా డబ్బులన్నీ దారి మళ్లించేసింది. దుర్మార్గపు ఆలోచనలతో విద్యుత్ ఒప్పందాలను జగన్ రద్దు చేశారు. పీపీఏల రద్దుపై కోర్టులు మొట్టికాయలు వేసినా మారలేదు. వాడని విద్యుత్కు రూ.9వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. 9 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.32,166 కోట్ల భారం మోపారు’’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
(The above story first appeared on LatestLY on Nov 07, 2024 06:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

