Cyclone Yaas: అతి తీవ్ర తుఫానుగా మారనున్న యాస్, ఈ నెల 26 వరకు భారీ వర్షాలు, అదే రోజు ఒడిశా, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం, నేడు యాస్ తుఫానుపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడింది. ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా మారనున్న ఈ తుఫాను 24వ తేదీన యాస్ తుపానుగా (Cyclone Yaas) రూపాంతరం చెందనుంది. ఆ తర్వాత 24 గంటల్లో మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా (Cyclone Yaas Updates) మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
New Delhi, May 23: తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడింది. ఆదివారం సాయంత్రానికి వాయుగుండంగా మారనున్న ఈ తుఫాను 24వ తేదీన యాస్ తుపానుగా (Cyclone Yaas) రూపాంతరం చెందనుంది. ఆ తర్వాత 24 గంటల్లో మరింత బలపడి అతి తీవ్ర తుపానుగా (Cyclone Yaas Updates) మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలకు ఈ నెల 26న చేరే సూచనలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అదేరోజు సాయంత్రం ఒడిశా, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని తాకే వీలుందన్నారు.
యాస్ తుఫానుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష (PM Narendra Modi to Hold Review Meeting) నిర్వహించనున్నారు. తుఫాను నేపథ్యంలో చేపట్టాల్సిన సన్నాహాలను సమీక్షించేందుకు ఉదయం 11 గంటలకు సీనియర్ ప్రభుత్వ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రతినిధులు, టెలికాం, విద్యుత్, పౌర విమానయాన, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రితో పాటు ఆయాశాఖల మంత్రులు హాజరవనున్నారు. తుఫాను ఈ నెల 24 -26వ తేదీ మధ్య ఒడిశా తీరంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
తుఫాను నేపథ్యంలో రైల్వే ఒడిశాలోని భువనేశ్వర్, పూరి నుంచి 20కిపైగా తాత్కాలిక రైళ్లను రద్దు చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) తుఫాను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ తుఫాను నేపథ్యంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.
యాస్ తుపాను నేపథ్యంలో భారత నౌకాదళం, తీరగస్తీ దళం(కోస్ట్గార్డ్) సహాయక చర్యలకు సిద్ధమయ్యాయి. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 8 ఫ్లడ్ రిలీఫ్ బృందాలతోపాటు నాలుగు డైవింగ్ బృందాలను ఒడిశా, పశ్చిమ బెంగాల్కు తూర్పు నౌకాదళం పంపించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు 4 నేవీ షిప్లు విశాఖ నుంచి బయలుదేరాయి.
విశాఖలోని ఐఎన్ఎస్ డేగా, చెన్నైలోని ఐఎన్ఎస్ రజాలి నేవల్ ఎయిర్ స్టేషన్లలో నేవల్ హెలికాప్టర్లు, మెడికల్ టీమ్లు బయలుదేరాయి. ఇండియన్ కోస్ట్ గార్డు కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమైంది. తమిళనాడు, ఒడిశా, ఏపీ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో సముద్ర జలాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు సేఫ్టీ బోట్స్ను పంపించేందుకు సిద్ధంగా ఉంచినట్టు విశాఖ కోస్ట్గార్డ్ ప్రధాన కార్యాలయ వర్గాలు తెలిపాయి.
తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఆదివారం గంటకు 40 నుంచి 50 కి.మీ., గరిష్టంగా 60 కి.మీ. వేగంతోనూ, 24న 50 నుంచి 60 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో గంటకు 60 నుంచి 70 కి.మీ., గరిష్టంగా 80 కి.మీ. వేగంతో గాలులు వీస్తామని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు.
5 రోజులపాటు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాను గుజరాత్, మహారాష్ట్రలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో భారీగా నష్టం వాటిల్లింది.
(The above story first appeared on LatestLY on May 23, 2021 10:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

