IMD Weather Update: ఐఎండీ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో, 5 రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరిక, తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రిపోర్ట్ ఇదే..
దేశంలో భానుడు భగభగమంటున్నాడు.ప్రతిరోజు 40 నుంచి 45 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఇప్పటికే ఎండలతో జనం మాడిమసైపోతుంటే రాగల మూడు నాలుగు రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.
New Delhi, May 19: దేశంలో భానుడు భగభగమంటున్నాడు.ప్రతిరోజు 40 నుంచి 45 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఇప్పటికే ఎండలతో జనం మాడిమసైపోతుంటే రాగల మూడు నాలుగు రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎండలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. అదేవిధంగా మరో 9 రాష్ట్రాలకు రిలీఫ్ వార్తను అందించింది. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసింది.
ఈ నెల 20వ తేదీ (శనివారం) నుంచి 23వ తేదీ (మంగళవారం) వరకు నాలుగురోజులపాటు ఓ 5 రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణ ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు జార్ఖండ్ ప్రాంతాల్లో ఆ నాలుగు రోజులపాటు ఎండలు దంచికొడుతాయని తెలిపింది.
పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు, న్యూ కలెడోనియాను వణికించిన భారీ భూకంపం
అదేవిధంగా ఇవాళ, రేపు (19, 20 తేదీల్లో) 9 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. కేరళ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఆ రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తెలంగాణలో భానుడు భగభగలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుసగా ఎనిమిదో రోజు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో.. జనాలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్రంలో కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని వీణవంక, నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
నిర్మల్ జిల్లా కడెం పెద్దూరులో 45.1 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జన్నారంలో 44.9, సూర్యాపేట జిల్లా మోతెలో 44.8, గరిడేపల్లిలో 44.8, మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 44.5, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగిలో 44.5, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 44.5, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 44.5, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 44.5, కుమ్రం భీం జిల్లా కెరిమెరిలో 44.4, నిజామాబాద్ జిల్లా భోధన్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్లో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాప్రాలో 41.3, ఉప్పల్లో 41.2, చార్మినార్లో 41.1, కుత్బుల్లాపూర్లో 40.9, నాంపల్లిలో 40.7, సరూర్నగర్లో 40.5, కూకట్పల్లిలో 40.4, హిమాయత్నగర్లో 40.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఏపీలో మండిపోతున్న ఎండలు
ఏపీ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యల్పంగా విశాఖపట్నం (గంభీరం)లో 38.9, కోనసీమ అంబేడ్కర్ జిల్లా(అంగర)లో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం, వల్లూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచాయని, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 29 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండనుంది. అనకాపల్లి జిల్లాలో 5, గుంటూరులో ఒకటి, కాకినాడలో ఒకటి, ఎన్టీఆర్ జిల్లాలో 2, పల్నాడులో 2, మన్యంలో 5, విజయనగరంలో 5, వైఎస్సార్ జిల్లాలో 8 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. శనివారమూ 33 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీలు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు వహించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
(The above story first appeared on LatestLY on May 19, 2023 06:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

