COVID in India: ఈ ఉధృతి తగ్గేదెప్పుడు.. భారత్‌లో మరో రోజు కూడా రికార్డ్ స్థాయిలో 4.14 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే 4 వేలకు చేరువగా కోవిడ్ మరణాలు

భారత్‌లో సెకండ్ వేవ్ కరోనా మహా విజృంభన కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, గత పదిరోజులుగా దేశవ్యాప్తంగా 3 వేలకు తక్కువ కాకుండా కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా మరింత పెరుగుతోంది...

COVID in India: ఈ ఉధృతి తగ్గేదెప్పుడు.. భారత్‌లో మరో రోజు కూడా రికార్డ్ స్థాయిలో 4.14  లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే 4 వేలకు చేరువగా కోవిడ్ మరణాలు
Coronavirus pandemic (Photo-PTI)

New Delhi, May 7: భారత్‌లో సెకండ్ వేవ్ కరోనా మహా విజృంభన కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, గత పదిరోజులుగా దేశవ్యాప్తంగా 3 వేలకు తక్కువ కాకుండా కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా మరింత పెరుగుతోంది. గడిచిన ఒక్కరోజులో మహారాష్ట్రలో అత్యధికంగా 853 మరణాలు నమోదు కాగా.. ఉత్తరప్రదేశ్, దిల్లీ మరియు కర్ణాటక రాష్ట్రాలలో 300 మందికి పైగా మరణించారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేరళ మరియు మధ్యప్రదేశ్ లాక్డౌన్ తమ రాష్ట్రాలలో సంపూర్ణ లాక్డౌన్ విధించుకున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వారం పాటు పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే, ఇక రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుడు పరిస్థితి ఏంటని సుప్రీంకోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటినుంచే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని మోదీ ప్రభుత్వానికి సుప్రీం సూచించింది.

భారత్‌లో పరిస్థితులను చూసి చాలా దేశాలు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి, అదే సమయంలో భారత్ నుంచి వచ్చే వారిపై నిషేధం విధిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు తమ బాధ్యతగా స్వీయ రక్షణ పాటిస్తూ కరోనాపై యుద్ధం చేయడంలో తమ వంతు పాత్ర పోషించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 4,14,188 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యధికం. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,14,91,598కు చేరింది. నిన్న ఒక్కరోజే 3,915 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య  2,34,083కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,31,507 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,76,12,351 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 36,45,164 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 81.95 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 16.96 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.09% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

మే 6 నాటికి దేశవ్యాప్తంగా 29,86,01,699 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 18,26,490 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 16.49 కోట్లు దాటింది.. తాజా గణాంకాల ప్రకారం 16,49,73,058 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

(The above story first appeared on LatestLY on May 07, 2021 09:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).